ఖానాపూర్ టౌన్, జనవరి 13 : ఖానాపూర్ పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం శ్రీగోదారంగనాథుల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. అశేష భక్తజనులు ఈ ఉత్సవంలో పాల్గొనగా.. అర్చకులు స్వామివారి కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగించి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఉత్సవ మూర్తులకు పంచమృతాలతో అభిషేకించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ చక్రపాణి వాసుదేవాచార్యులు, స్థానాచార్యులు నరసింహమూర్తి, శ్రీనిమ్మగడ్డ సందీప్శర్మ పలువురు దంపతులతో కల్యాణాన్ని జరిపించారు. అనంతరం మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి కానుకలు అందజేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ అధ్యర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డగట్ల రాజన్న, పొలంపెల్లి రమేశ్, పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
భైంసా పట్టణంలో..
పట్టణంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కడెం మండలం అక్కకొండలో..
మండలంలోని దిల్దార్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహ ఆలయంలో గోదారంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు పీసుపాటి చంద్రశేఖర్శర్మ, శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్దార్నగర్, ఎలగడప, అక్కకొండ గ్రామాల్లో ఆధ్మాత్మిక వాతవరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆగునూరి సత్తమ్మ, ఎంపీటీసీ నర్సింగ్ రమేశ్, వీడీసీ చైర్మన్ రాజేశ్వర్, ఉపసర్పంచ్ ఉమేశ్, నాయకులు గంగన్న, శేఖర్, రాపర్తి పెద్దలక్ష్మణ్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్ మండలంలో..
మండల కేంద్రంలోని శ్రీ నల్లగొండ లక్ష్మీ నరసిహ స్వామి ఆలయంలో, మండలంలోని రేవోజిపేట శ్రీ సీతారామాలయంలో శ్రీ గోదాదేవి-రంగునాథుల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండమాచార్యులు, వొద్దిపర్తి వంశీకృష్ణ చార్యుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని అంగరంగా వైభవంగా జరిపించారు. ముందుగా స్వామి వారికి పట్టు వస్ర్తాలను సన్నాయి మేళంతో ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అలంకరించిన వేదికపై స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు, అర్చకులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు, మంగళసూత్రాలను సమర్పించారు. అర్చకులు కల్యాణ ప్రాసస్త్యాన్ని వివరించారు. అనంతరం మహిళా భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కానుకలు సమర్చించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు అర్చకులు స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.