లక్ష్మణచాంద, డిసెంబర్ 18 : కోరిన కోరికలు తీర్చే ధర్మారం కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19, 20వ తేదీల్లో నిర్వహించే కోతి దేవుని జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల, నిజామాబాద్, పలు జిల్లాల నుంచి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.
45 ఏళ్ల క్రితం లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం గ్రామంలో ఒక కోతి వచ్చింది. అది ప్రజల పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది. అందరూ ఆ కోతిని కుటుంబ సభ్యుడిగా భావించి దానికి కావాల్సిన తినుబండారాలు అందించే వారు. కొద్ది కాలానికి కోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ ప్రజలను, ప్రజలను గాయపర్చడం చేసింది. కోతి చేష్టలతో గ్రామస్తులు విసుగుచెందారు. గ్రామంలో కోతి ఉంటే ప్రమాదం ఉందని గ్రహించి తరిమి వేసే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు తరిమినా తిరిగి గ్రామంలోకి కోతి రావడంతో చంపివేసి పూడ్చిపెట్టారు. అనంతరం రెండు, మూడు రోజుల తర్వాత గ్రామ పెద్దకు కలలోకి వచ్చి తనకు సమాధి ఏర్పాటు చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని, తన కళేబరం ఉన్న చోటు చెప్పింది. దాంతో గ్రామ పెద్ద గ్రామస్తులకు కలలో చెప్పిన విషయాన్ని వివరించి కళేబరాన్ని తీసుకువచ్చి పీచరకు వెళ్లే రహదారి పక్కన, చిన్న చెరుకు కట్టకు సమీపంలో సమాధిని కట్టించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమాధికి మొక్కిన వారి కోరికలు తీరడంతో క్రమంగా భక్తుల సంఖ్య పెరిగింది. గ్రామ కమిటీ, భక్తుల సహాయంతో కోతి దేవుని ఆలయాన్ని నిర్మించారు. సమాధి చేసిన రోజున ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తున్నారు.