ఎదులాపురం, డిసెంబర్ 17 : మున్సిపల్ మ్యుటేషన్లలో సాంకేతిక లోపాలు సవరిస్తున్నామని వరంగల్ ఆర్జేడీ షాహిద్ మసూద్ అన్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన మ్యుటేషన్ల విచారణకు శనివారం ఆయన ఆదిలాబాద్కు వచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో మ్యుటేషన్ల కోసం వచ్చిన 1775 దరఖాస్తులను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. గతేడాది కాలంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో మాట్లాడుతూ వారి వివరణ తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో జరిపిన విచారణకు సంబంధించిన వివరాలు మున్సిపల్ కమిషనర్ శైలజ ఆర్జేడీకి వివరించారు. అలాగే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని కొన్నిపత్రాలు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా పనులను పరిశీలించారు. నర్సరీ, హరితహారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యుటేషన్ల కోసం అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్జేడీ వెంట సిబ్బంది ఉన్నారు.