ఇంద్రవెల్లి, డిసెంబర్ 17:ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలతో గిరిజనులు పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆరురోజులుగా రాత్రీపగలు తేడాలేకుండా బోధనలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులకు కుమ్ర దత్తుమహారాజ్, మరప పుండలిక్ మహారాజ్, మెస్రం దాదారావ్ మహారాజ్ శివలీల పారాయణంతోపాటు వివిధ ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధిస్తున్నారు.
పదేండ్ల నుంచి బోధిస్తున్నా..
నేను పదేండ్ల నుంచి వివిధ రకాల ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధిస్తున్నా. వేదమంత్రోచ్ఛారణల మధ్య నూతన ప్రారంభోత్సవాలు చేస్తున్నా. మా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఏ కార్యక్రమాలున్నా అక్కడికి వెళ్లి వేద పండితుడిగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ప్రవచనాలు బోధించడం నాకు చాలా ఇష్టం. సమాజంలోని ప్రజలకు మంచి మార్గాలు చేప్పడమే నా లక్ష్యం. నాకు వచ్చిన ఆహ్వానాల మేరకు అన్ని గ్రామాలకు వెళ్తుంటా.
– కొడప వినాయక్రావ్ మహారాజ్, పిప్రి, ఇంద్రవెల్లి
ఆదివాసీ చైతన్యానికి కృషి
నేను 20 యేండ్లుగా అన్ని రకాల ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధిస్తున్నా. నాకు చిన్ననాటి నుంచి ప్రవచనాలు బోధించడమంటే చాలా ఇష్టంగా ఉండేది. గ్రామాల్లో ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధించడంతో నా చిన్ననాటి కల నెరవేరింది. ఆదివాసీ సమాజాన్ని చైతన్యం చేయడానికి నావంతు కృషి చేస్తున్నా. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో మార్పులు తీసుకొస్తున్నా.
– పెందూర్ రాంషావ్ మహారాజ్, గుంజాల, నార్నూర్
ఆధ్యాత్మిక మార్గాలు పెరగాలి
ధైవ భక్తితోపాటు సమాజంలో ఆధ్యాత్మిక మార్గాలు పెరగాలి. నేను 36 యేండ్లుగా ప్రవచనాలు బోధిస్తున్నా. నేను ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ర్టలోని ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ప్రవచనాలు లేకపోతే నేటి తరానికి పురాణాలపై అవగాహన ఉండదు. మన సంస్కృతితోపాటు మంచి మార్గాలు నేర్పించాలి. అప్పుడే మన చరిత్ర, సంస్కృతి నాలుగు తరాలకు తెలుస్తది.
– వెడ్మ జైవంత్రావ్ మహారాజ్, జామడ, నార్నూర్
ఆధ్మాత్మిక మార్గాలు చూపించడమే లక్ష్యం
నేటి తరంలో మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలను చెడు వ్యసనాలను దూరం చేస్తూ ఆధ్మాత్మిక మార్గాల వైపు నడిపించడమే నా లక్ష్యం. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు నాకు ఆహ్వానాలు పంపుతుంటారు. నేను అన్ని రకాల పూజలు చేస్తా. అన్ని రకాల వేదాలు చదువుతా. నాకు నా తండ్రి వేదాలు నేర్పించారు. ఒక్క ఆదివాసీగా వేదాలు చదవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
– ఆత్రం పురుషోత్తం మహారాజ్, గురుదేవ్ నగర్, బోథ్
ప్రజల్లో మార్పుల కోసమే..
సమాజంలో అన్ని రకాల ప్రజలున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజల్లో దాగిన చెడు మార్గాలను తొలగించడమే నా లక్ష్యం. నేను 40 సంవత్సరాల నుంచి సమాజానికి ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధిస్తున్నా. నలుగురికి మేలు జరిగేలా ప్రవచనాలు చెబుతుంటా. సమాజంలో మార్పులు వస్తేనే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ భక్తి అనే పదాలు తెలిస్తేనే అన్ని రకాల మేలు జరుగుతుంది.
– నారాయణ మహారాజ్, మహదాపూర్, ఇచ్చోడ
ప్రవచనాలు బోధించడం ఇష్టం
గ్రామాల్లో ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే నేను అక్కడికి వెళ్తా. నేను చెప్పాలనుకున్న ప్రవచనాలన్నీ బోధిస్తా. నేను 20 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించా. ప్రజలకు అన్ని రకాల బోధనలు చేస్తున్నా. మహాభారతంతోపాటు రామాయణం, శివలీల గ్రంథంలోని ప్రవచనాలు ప్రజలకు అందిస్తున్నా. సాధారణ జీవన విధానంతోపాటు ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక ప్రవచనాల అవరసం ఉంది.
– మరప పుండలిక్ మహారాజ్, కేస్లాపూర్, ఇంద్రవెల్లి