భీంపూర్, డిసెంబర్ 16 : సహకార సంఘం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తాంసి మండల ప్రాథమిక సహకార సంఘంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరంజి(టీ), అర్లి(టీ), గిరిగాం, కప్పర్లలో మొదటి ఫేజ్లో గోదాంలను నిర్మిస్తామని తెలిపారు. తాంసి పీఏసీఎస్ సమీపంలో సంఘానికి సంబంధించి వాణిజ్య దుకాణ సముదాయం నిర్మిస్తామన్నారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం అమోదించారన్నారు. సహకార బ్యాంకులో డిపాజిట్లు చేయాలని కోరారు. వ్యవసాయాభివృద్ధి కోసం తక్కువ వడ్డీతోనే రుణాలు ఇస్తామన్నారు. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా సబ్సిడీ ఎరువులు అందిస్తుండగా భవిష్యత్లో పురుగు మందులు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీఈవో కేశవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, సర్పంచ్ కృష్ణ, డైరెక్టర్లు ఏనుగు అశోక్రెడ్డి , అరుణ్కుమార్, గంగుబాయి, కవిత, రమేశ్, భూమారెడ్డి , యాదవ్, కార్యదర్శులు కర్నేవార్ గణేశ్, సుధాకర్ పాల్గొన్నారు.