నార్నూర్, డిసెంబర్ 16 : ప్రభుత్వ బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు మన ఊరు-మన బడి కింద నిధులు కేటాయిస్తూ పనులకు శ్రీకారం చుట్టింది. నామినేటెడ్ ద్వారా స్థానిక, పట్టణ ప్రాంతాల కాంట్రాక్టర్లకు పనులను అప్పగించి నిర్మాణ పనులు చేపడుతున్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభ సంతరించుకోనున్నాయి.
నార్నూర్, గాదిగూడ మండలాల్లోని గ్రామాల్లో 19 ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.2కోట్లు కేటాయించింది. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు రెండు మండలాల్లో పనులు చేపట్టారు.
బడులు మెరిసేలా పనులు..
పాఠశాలలో ఉన్న పాత నాపరాయిని తీసివేసి పాలీష్రాయి, టైల్స్, కిచెన్షెడ్లు, మరుగుదొడ్ల, బాత్రూంలు, విద్యుత్, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లకు నీటి వసతి, డోర్లు, కిటికీలు, బడులస్లాబ్కు రూప్సీలింగ్, ఎయిర్ కోటింగ్ పనులు చేపడుతున్నారు. స్లాబ్పై ఎయిర్ కోటింగ్తో పాటు కొత్తగా వచ్చిన సిలికాన్ లిక్విడ్తో సీలింగ్ నుంచి నీరు కురవకుండా, ప్రహరీ నిర్మాణ పనులు చేయిస్తున్నారు. గతంలో చెట్ల కింద వరండాల్లో భోజనాలు చేసే విద్యార్థుల కోసం ప్రత్యేకించి డైనింగ్ హాల్ను నిర్మిస్తున్నారు. క్లాస్రూముల్లో ఉన్న ఎగుడు, దిగుడు ఉన్న నాపరాయిని తొలగించి కొత్తగా వేయిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి గదులు, స్టాఫ్రూం గదులు కూడా కొత్తగా మార్చివేస్తున్నారు.
90శాతం పనులు…
మన ఊరు..మన బడి కింద చేపట్టిన పనుల్లో దాదాపుగా 90శాతం వరకు పూర్తి కావచ్చాయి. నిర్మాణ పనులు పూర్తి కాగానే రంగులు వేయనున్నారు. ఒకే రకమైన రంగులు వేసేందుకు ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. వచ్చే నెలలోగా పాఠశాలల మరమ్మతులు పూర్తి చేసి ఇవ్వాలని పాఠశాల యజమాన్యం సహకారంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు నిత్యం పనులను పరిశీలిస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని విద్యార్థులకు తల్లిదండ్రులు కోరుతున్నా రు..
విద్యకు పెద్దపీట…
ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడంతో పాటు సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. పనులు సకాలంలో పూర్తిచేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలి.
-కనక మోతుబాయి, ఎంపీపీ, నార్నూర్