ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 16 : ప్రత్యేక అవసరాలు కలిగిన భవిత కేంద్రాల నిర్వహణకు సహకరిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డైట్ శిక్షణ కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన భవిత కేంద్రంలో హ్యాండీ క్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సంస్థ ద్వారా పుస్తకాలు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు, చైతన్య ప్రసంగం, ఏకపాత్రాభినయంపై కలెక్టర్ అభినందనలు తెలిపారు. విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిత కేంద్రంలోని పిల్లల విద్యాభ్యాసానికి అదనపు తరగతులు, ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. భవిత కేంద్రంలోని పిల్లల విద్యాబుద్ధులు తిలకించామని, వారిలో నైపుణ్యత ఉందని అన్నారు. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా ఫ్యాకల్టీ విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. లర్నింగ్, ప్లేయింగ్ మెటీరియల్ సమకూరుస్తామని తెలిపారు. సామాజిక సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తూ సమాజాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు పాటుపడాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యాబుద్ధులు అందిస్తున్న ఫ్యాకల్టీని అభినందించాలన్నారు. కార్యక్రమంలో డైస్ ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.