మంచిర్యాల, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ డయాలసిస్ రోగులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అండగా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా సేవలందిస్తున్నది. ఈ నాలుగేళ్లలో 1.44 లక్షల సెషన్లు చేపట్టగా, ప్రస్తుతం 326 మందికి నిత్యం చికిత్స అందస్తున్నది. ఇప్పటికే ఆయాచోట్ల 35 బెడ్లు అందుబాటులో ఉంచగా, త్వరలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, లక్షెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లిలోని దవాఖానల్లో ఒక్కోచోట 5 బెడ్ల చొప్పున ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. కాగా, గతంలో వ్యయప్రయా సాలకోర్చి.. సుదూర ప్రాంతాలకు పరుగులు తీసిన పేషెంట్లకు, ప్రస్తుతం స్థానికంగా నయాపైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకొనే అవకాశం కలిగింది.
డయాలసిస్.. ఇది అత్యంత తీవ్రమైన సమస్య. కిడ్నీలు పాడైపోయి శరీరానికి సరిపడా రక్తం సరఫరాకాక డయాలసిస్ పేషెంట్లు నిత్యం నరకం చూస్తుంటారు. వారంలో రెండు లేక మూడుసార్లు రక్తం బయటి నుంచి శరీరంలోకి ఎక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ చేయించుకోలేదా ప్రాణాలకే ప్రమాదం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో డయాలసిస్ సెంటర్లు లేక వ్యాధిగ్రస్తులు నానా అవస్థలు పడేవారు. వైద్య సేవల కోసం పొరుగు జిల్లాల్లోని దవాఖానలకు వెళ్లేవారు. ఈ క్రమంలో సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు విడిచిన వారు అనేకం. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ వైద్యంపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన చోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మారుమూల ప్రాంతాలకు సైతం డయాలసిస్ సేవలు చేరువయ్యాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు 50 లక్షల డయాలసిస్ సైకిల్స్ చేశాయి. ఉమ్మడి జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో 1.44 లక్షల డయాలసిస్ సైకిల్స్ అయ్యాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ల ద్వారా 1,133 మందికి సేవలు అందాయి. ప్రస్తుతం 326 మంది పేషెంట్లకు చికిత్స అందుతున్నది.
ఉమ్మడి జిల్లాల్లో నాలుగేళ్లుగా..
2018లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గడిచిన నాలుగేళ్లుగా ఇవి విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రిమ్స్లో 10,ఇదే జిల్లా ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానలో 5, మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 10, నిర్మల్లో 10.. ఇలా మొత్తం 35 బెడ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు ఉమ్మడి జిల్లాలో ఈ సేవలు లేక కరీంనగర్, వరంగల్లలోని హాస్పిటల్స్కు వెళ్లాల్సి వచ్చేది. గంటల కొద్దీ ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటే.. బెడ్లు దొరకక రోజుల కొద్దీ ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది. ఈ లోపు ప్రాణం ఉంటుందో లేదో గ్యారంటీ ఉండేది కాదు. ఇక తప్పదనుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఒకసారి డయాలసిస్ చేయడానికి రూ.3000 దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాధిగ్రస్తులు మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా వ్యాధిగ్రస్తులు రిమ్స్ లేక ఉట్నూర్, నిర్మల్ జిల్లా వ్యాధిగ్రస్తులు జిల్లాకేంద్రంలోని దవాఖానలోనే సేవలు పొందుతున్నారు. కాగా, ఇటీవల ఆసిఫాబాద్, కాగజ్నగర్, లక్షెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి దవాఖానల్లో ఒక్కోచోట 5 బెడ్ల చొప్పున.. మొత్తం 25 బెడ్లతో డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆయా చోట్ల త్వరలో సేవలు ప్రారంభిస్తామని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నిత్యం రూ.5 లక్షల విలువైన సేవలు..
ప్రభుత్వ దవాఖానల్లోని సెంటర్ల ద్వారా డయాలసిస్ పేషెంట్లకు నిత్యం సేవలు అందుతున్నాయి. ఒక్కో బెడ్పై రోజుకు ఐదుగురి చొప్పున ఉమ్మడి జిల్లాలో నిత్యం 170 నుంచి 175 మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఒక్కో పేషెంట్కు 4 గంటల చొప్పున 20 గంటలు మిషన్లు పనిచేస్తున్నాయని, మిగిలిన నాలుగు గంటలు క్లీనింగ్కు పోతున్నాయని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సేవలను ప్రతి రోజూ ఈ సెంటర్ల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. ఎయిడ్స్, హైపటైటిస్తో బాధపడే డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేక గదిలో సేవలు అందిస్తున్నారు. వచ్చిన వారు ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన పని లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బస్ పాస్లు.. పింఛన్లు..
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్లతో దూర, ఆర్థిక భారం తగ్గిందని, సమయానికి వైద్యం చేయించుకోగలుగుతున్నామని పలువురు డయాలసిస్ పేషెంట్లు చెబుతున్నారు. తమ కష్టాన్ని గుర్తించి వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు ఉచిత బస్సు పాస్ సదుపాయం, ఆసరా పింఛన్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇచ్చే పింఛన్తో తమ ఖర్చులు తీరుతున్నాయని, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదంటుందన్నారు. ఉచిత బస్ పాస్లతో రవాణా ఇబ్బందులు తప్పాయని చెబుతున్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వచ్చి వైద్యం చేయించుకొని తిరిగి వెళ్తున్నామంటున్నారు.
ప్రతి రోజూ 35 నుంచి 45 మందికి..
పేదలు ఉచిత డయాలసిస్ సేవలను సద్విని యోగం చేసుకోవాలి. నిర్మల్ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు 35 నుంచి 45మందికి వరకు డయాలసిస్ చేస్తు న్నాం. ఇది వరకు దూరప్రాంతాలకు వెళ్లే వారు. రోగులు అన్ని రకాల ఇబ్బందులు పడేవారు. మా వద్ద రోగి వయసు, ఆరో గ్య స్థితిని దృష్టిలో పెట్టుకొని వైద్య నిపు ణుల సూచనలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నాం. ఒక్కో రోగికి రెండు నుంచి నాలుగు గంటల వరకు డయాలసిస్ చేస్తున్నాం.
– సాయితేజ, డయాలసిస్ ఇన్చార్జి, నిర్మల్ జిల్లా దవాఖాన
సర్కారోళ్ల పుణ్యమాని..
ఎదులాపురం, డిసెంబర్16 : ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఉచితంగా డయాలసిస్ చేయిస్తుంది. సీఎం కేసీఆర్ సారు రూ.2016 ఫించన్ కూడా ఇస్తున్నారు. బస్పాస్ కూడా ఇచ్చారు. బోథ్ నుంచి రిమ్స్కు వచ్చి సేవలు పొందుతున్నా. సర్కారోళ్ల పుణ్యమాని బతుక్కి భరోసావచ్చింది.
– జీ.నర్సయ్య, కౌట, బోథ్ మండలం
దూరం పోవాల్సిన పనిలేకుంటైంది.
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 16 : రెండేండ్ల కింద నాకు రక్తం తక్కువగా ఉందని డాక్టర్ దగ్గరకు పోయిన. కిడ్నీలు ఖరాబైనయని చెప్పిన్రు. మా కొడుకు కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖా నకు తీసుకపోయి చూపించేటోడు. డయాలసి స్కు పోయినప్పుడల్లా రూ.2500, రాను పోను, తిండి ఖర్చులు ఓ రూ.1000 దాకా అయ్యేటివి. ఇట్లా వారానికి మూడుసార్లు పోయేదాన్ని. మస్తు అప్పుల పాలైనం. ఇగ మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలనే డయాల సిస్ చేస్తున్ననిరని చెప్పిన్రు. ఇగ ఇక్కడికే వచ్చి చికిత్స పొందుతున్న. ఇప్పుడు దూరం పోవాల్సిన పనిలేకుంటైంది. నయాపైసా ఖర్చులేకుండా ఇక్కడే చూపించుకుంటున్న. ఇందుకు సర్కారోళ్లకు రుణపడి ఉంటం.
– అక్కల లచ్చవ్వ, చింతపల్లి, దండేపల్లి
ప్రైవేట్ దవాఖానకు పోయే బాధతప్పింది
ఎదులాపురం,డిసెంబర్16 : డయాలసిస్ చికిత్స కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన బాధతప్పింది. ఏడాది నుంచి రిమ్స్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నా. పక్క జిల్లాలకు పోయినప్పుడు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఖర్చయ్యేది. ఇక ఇతర ఖర్చులు కలిపి రూ.5 వేల వరకు అయ్యేది. ఇప్పుడు సర్కారు పుణ్యమాని రూపాయి ఖర్చుచేయకుండా చికిత్స చేయించుకుంటున్నా.
–ఆసిఫ్, ఇచ్చోడ, ఆదిలాబాద్
రూపాయి ఖర్చులేకుంటైంది
కొన్నేండ్ల సంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న. ఇది వరకు కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానలో సూపెట్టుకునేటోన్ని. డయాలసిస్కు పోయినప్పుడల్లా రూ. 5 వేల దాకా ఖర్చయ్యేది. వారానికి మూడుసార్లు పోయేటోన్ని. అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్మల్ దవాఖానలోనే డయాలసిస్ సేవలు ప్రారంభించింది. ఇగ అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్న. అట్లనే సర్కారోళ్లు పింఛన్ కూడా ఇస్తున్నరు. ఉచితంగా బస్పాస్ కూడా ఇచ్చిన్రు. రూపాయి ఖర్చులేకుంటైంది. – బిక్కి శంకర్, కంకెట (నిర్మల్)