బేల, డిసెంబర్ 15 : అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రజక సంఘ భవన నిర్మాణానికి గురువారం మండల నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్రతి కుల సంఘానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ఆదిలాబాద్, బేల, జైనథ్ మండలాల్లో ఇప్పటికే చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
సంఘ భవనాల నిర్మాణానికి విన్నవించగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే రూ. 5 లక్షలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, రజక సంఘం మండలాధ్యక్షుడు మగడివార్ ప్రకాశ్, నాయకులు బాల్చందర్, విపిన్, ఆకాశ్ గుండావార్, తదితరులు పాల్గొన్నారు.