ఎదులాపురం, డిసెంబర్ 14 : పని చేసే ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డివిజిన్ స్థాయి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,హెచ్డబ్ల్యూవోలు, ఎస్ఈ, ఆర్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఉపాధ్యాయులకు టీఎల్ఎం మేళా, విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్లం లోనే పాఠాల ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు టీచింగ్ డెయిరీ, ఆ రోజు ఇచ్చిన హోంవర్క్ను రాయాలని పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం సూపర్విజన్ స్టడీస్ పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎంసీ సమావేశాలు రెగ్యూలర్గా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏసీఎంవో జగన్, గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, ఏటీడీవో నిహారిక, సంజీవ్, నారాయణరావు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్తో ఉజ్వల భవిష్యత్
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 14 : అథ్లెటిక్స్ పోటీలతో విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ ఉంటుందని జిల్లా గిరిజన సంక్షేమ డీడీ దిలీప్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్కంట్రీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకొని అందులో క్రమం తప్పకుండా శిక్షణ పొందితే విజయం సాధిస్తారని వివరించారు. ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రోత్సాహంతో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమేశ్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, వీజీఎస్ రాకేశ్, జగన్ పాల్గొన్నారు.