ఎదులాపురం, డిసెంబర్ 9 : ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద నిర్వహించే పాఠశాలల పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం మన ఊరు – మన బడి కింద నిర్వహించే పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 37 పాఠశాలలు మోడల్ సూళ్లుగా గుర్తించి మన ఊరు – మన బడి కింద చేపడుతున్న పనులను పూర్తి చేసి జనవరిలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, ప్రహరీ నిర్మాణ పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలకు రంగులు సరిగా వేశారా లేదా అని సర్పంచ్లు, ఎస్ఎంసీ కమిటీలు పరిశీలించాలన్నారు.
రంగులు వేసే సమయంలో ఫర్నిచర్, ఫ్యాన్, విద్యుత్ బోర్డులు, నేలపై పడిన రంగులను తొలగించే విధంగా శుభ్రం చేసుకోవాలన్నారు. మన ఊరు- మన బడి కింద చేపట్టిన పనులకు ఎంబీ రికార్డు నిర్వహించి సమర్పించడం ద్వారా నిధులు వెంటనే వారి పాఠశాల మేనేజ్మెంట్ ఖాతాలో జమ చేయడం జరుగుచున్నదని తెలిపారు. ఇప్పటి వరకు రూ.4కోట్ల71లక్షల ఆయా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖాతాలో జమ చేశారని, మరో రూ.2 కోట్లు ఖాతాలో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సమావేశంలో డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారి నారాయణ, డివిజల్ పంచాయతీ అధికారి భిక్షపతి, డీఆర్పీ శ్రీపాద్, సర్పంచ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.