నార్నూర్, డిసెంబర్ 9 : వాతావరణంలో రెండు రోజులుగా తీవ్రమైన మార్పు వచ్చింది. రాత్రి, పగలు తేడా లేకుండా చలితీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవులు సైతం అల్లాడుతున్నాయి. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటగాస్తున్నారు. కానీ పశువులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో మేక, కుక్క, దూడ జాతి వైరాన్ని మరిచి ఒక్కటిగా కలిశాయి. ఓ రైతు ఇంటి ఎదుట కట్టేసిన దూడల మధ్య వెచ్చదనం కోసం కుక్క పిల్ల తలదాచుకోగా, మేక పిల్ల ఒడిలో కూర్చుంది. ఈ దృశ్యం శుక్రవారం మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో కనిపించగా.. మూగజీవులు జాతి వైరాన్ని మరిచి దగ్గరగా కలువడాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.