నిర్మల్ అర్బన్, డిసెంబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉపాధ్యాయలు సక్రమంగా సరైన సమయంలో పాఠశాలలో ఉంటే విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నది. ఇందుకు వినూత్నమైన సాంకేతిక పద్ధతులను అవలం భిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం చేందుకు కృషి చేస్తున్నది. జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చిం ది. దీని ద్వారా ఉపాధ్యాయులు, సిబ్బందికి హాజరు నమోదు చేస్తున్నది. గతంలో ఈ విధానం అమలులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇష్టం వచ్చిన సమయానికి పాఠశాలకు రావడం, సమయం కాకముందే ఇంటి బాట పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో డుమ్మాలు, సమయపాలన పాటించని ఉపాధ్యాయుల్లో మార్పు వస్తున్నది. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు హాజరవుతూ పాఠాలు బోధిస్తున్నారు.
పకడ్బందీగా ఈ విధానం అమలు
రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లో తీసు కొచ్చిన బయోమెట్రిక్ విధానాన్ని నిర్మల్ జిల్లాలో సెక్టోరియల్ అధికారి శ్రీదేవి పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. జిల్లాలో 19 మండలాల్లో 18 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 17 కేజీబీవీ పాఠశాలలో బయోమెట్రిక్ విధానం అమలు అవు తున్నది. ఇందులో 221 మంది టీచింగ్ స్టాఫ్, 252 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ విధులు నిర్వర్తి స్తున్నారు. ఇందులో సీఆర్టీలు 152 మంది పీజీసీ ఆర్టీలు 69 మంది ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ లో అటెండర్లు, స్వీపర్లు, వంటవాళ్లు, డే, నైట్ వాచ్ ఉమెన్లు ఇలా 252 మంది పని చేస్తున్నా రు. సాంకేతిక సమస్యలతో సోన్ కేజీబీవీలో బయోమెట్రిక్ విధానం అమలు కావ డం లేదు.
బయోమెట్రిక్తో హాజరు నమోదు
జిల్లాలోని కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది కి ఉదయం పాఠశాలకు చేరుకోగానే, పాఠశాల నుండి బయటకు వెళ్ల్లేటప్పుడు బయోమెట్రిక్ ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు. బయో మెట్రిక్ విధానంలో ఉపాధ్యాయులకు సంబంధిం చి లీవ్, సిక్ లీవ్, ఓడీ, స్పెషల్ హాలిడే ఆప్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు, సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకునే సమయంలో వారు పాఠశాలకు ఎప్పుడు వచ్చా రు. బయటకు ఎప్పుడు వెళ్ల్లారు అనేవి ఖచ్చిత మైన సమయం నమోదవుతుంది. దాని ఆధారంగానే వేతనాలు అందనున్నాయి.
లైవ్ లొకేషన్ యాప్తో నిఘా
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సక్ర మం గా విధులకు హాజరయ్యేందుకు ఉన్నత అధికారు లు జిల్లాలో రెండేళ్ల క్రితం లైవ్ లొకేషన్ విధానా న్ని తీసుకొచ్చారు. ఇటీవల నుంచి కేజీబీవీ పాఠ శాలల్లో సైతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
పకడ్బందీగా అమలు చేస్తున్నాం..
కేజీబీవీల బలో పేతానికి ప్రభుత్వం తీసు కొచ్చిన బయోమెట్రిక్ విధానాన్ని జిల్లాలో పకడ్బందీగా అమ లు పరుస్తున్నాం. నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు ఉండ గా.. ఇందులో 17 కేజీబీవీల్లో ఉపాధ్యాయులు, సిబ్బందికి బయో మెట్రిక్ ద్వారా హాజరు తీసు కుంటున్నాం. ఒక కేజీబీవీలో పరికం చెడిపోవడం వల్ల ఆలస్యం అయింది. త్వరలో ఆ పాఠశాలలో అమలు పరుస్తాం. సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండాలని ఆదేశించాం. నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై, సక్రమంగా పాఠశాలకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటాం. విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వారిని తీర్చిదిద్దుతాం.
– శ్రీదేవి, సెక్టోరియల్ అధికారి(నిర్మల్)