కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఆదిమ గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ఐటీడీఏ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా రూ.2.24 కోట్లతో 335 యూనిట్లు అందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రౌండింగ్ పూర్తి చేసి 100 శాతం సబ్సిడీపై ఎడ్లబండ్లు, గొర్రెలతో పాటు కిరాణాల కోసం ఆర్థిక సాయమందించనునున్నది. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో యూనిట్లు మంజూరు చేస్తుండగా, అడవిబిడ్డల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆదివాసీలకు అండగా నిలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో ఒకేసారి రూ. 2 కోట్ల 24 లక్షలతో ఆదివాసీ తెగలకు చెందిన (పీటీజీ) గిరిజనులకు 335 యూనిట్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలా ఒకేసారి వందలాది మందికి యూనిట్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా యూనిట్లన్నీ గ్రౌండింగ్ చేసే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.
మారుమూల గ్రామాల నుంచి లబ్ధిదారుల ఎంపిక..
మారుమూల ప్రాంతాలైన ఆసిఫాబాద్ మండలం దేవదుర్గుం, మానిక్పూర్, జైనూర్ మండలం పోచంలొద్ది, పాట్నాపూర్, గూడమామడ, పవార్గూడ, కెరమెరి మండలం లింగుగూడ, నిషాని, టోకెన్మోవాడ్, ఝరి, కోటారి, జోడెఘాట్, పర్థా, కొలారి, జన్గాం, అగర్వాడ, కేలి-బీ, కెస్లాగూడ, లింగాపూర్ మండలం జాముల్దర, కంజన్పల్లి, లొద్దిగూడ, చోర్పల్లి, సిర్పూర్-టీ మండలం వేంపల్లి, సిర్పూర్-యు మండలంలోని బెండార, తిర్యాణి మండలంలోని ఎదులపాడ్, చింతపల్లి, దంతన్పల్లి, బురదగూడ, పూసిగుమ్ని, సుంగాపూర్, మానిక్యాపూర్, బుగ్గరామన్నగూడ, మామిడిగూడ, చేమెల, వాంకిడి మండలం వెల్గి, కిర్డి, పాటగూడ, చౌపన్గూడ గ్రామాల నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
100 శాతం సబ్సిడీతో..
ఆదివాసీ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి గిరిజనులకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగపడే ఎడ్ల బండ్లను ప్రత్యేకంగా ఐటీడీఏ ద్వారా అందిస్తోంది. రూ. 2.24 కోట్లతో 335 యూనిట్లు మంజూరు చేస్తుండగా, ఇందులో 229 యూనిట్లు ఎడ్లబండ్లే కావడం విశేషం. ఇక మిగతా 97 గొర్రెలు, 9 కిరాణాల కోసం యూనిట్లు మంజూరు చేస్తున్నారు. 100 శాతం సబ్సిడీతో ఈ యూనిట్లు అందజేయనున్నారు. ఎడ్లబండ్లకు రూ. 75 వేలు, కిరాణాలు, గొర్రెల యూనిట్లకు రూ. 50 వేల చొప్పున అమలు చేయనున్నారు. సాధారణంగా ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందించే రుణాలు యూనిట్ విలువను బట్టి 60 నుంచి 80 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. కానీ.. ఆదిమ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి గిరిజనులకు ఈసారి 100 శాతం స బ్సిడీపై నేరుగా ఐటీడీఏ ద్వారా అందిస్తున్నారు. ఆర్థికంగా అన్ని గిరిజన తెగలకంటే వెనుబడి ఉన్న ఆదివాసీ కొలాం, మన్నేవార్, తోటి గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఈ రుణాలను అందిస్తున్నారు. 100 శాతం సబ్సిడీతో మంజూరైన 335 యూనిట్లకు సంబంధించిన డాక్యుమెంటేషన్ను అధికారులు చేపడుతుండగా, అడవిబిడ్డల్లో హర్షం వ్యక్తమవుతున్నది.