ఖానాపూర్ రూరల్, నవంబర్ 29: స్వయం సహాయక సంఘాల సభ్యులు చిరు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం కేవీ ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని మస్కాపూర్ ఎల్ఆర్ గార్డెన్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం స్వయం సహాయక సంఘాలకు రుణ పంపిణీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ జీడీపీ రేటు పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారాలు ప్రారంభించాలన్నారు. చిరు వ్యాపారాలు ప్రారంభించే స్వయం సహాయ సంఘాలకు బ్యాంకులు రుణాలు అందిస్తాయని చెప్పారు. బీమా ప్రీమియం చెల్లించి మరణించిన సభ్యుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు రూ. 15 కోట్ల విలువైన చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఏపీడీ డీఆర్డీవో గోవింద్, ఆర్ఎం వివేక్, సుభాష్, ఖానాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఏపీఎం సునంద, సీసీ బీక్సింగ్, వీవో సట్ల రాజు, మెప్మా సిబ్బంది శివ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.