ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, నవంబర్ 28 : సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిషేధిత మత్తు పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్లవేళలా తనిఖీలు నిర్వహించాలని సూచిం చారు. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కార్డన్ సెర్చ్లు నిర్వహించాలని ఆదేశించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదు దారులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. నాణ్యమైన సేవలందించాలని సూచించారు. అనంతరం కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ మాట్లాడారు. జిల్లాలో పోలీసుల పనితీరును డీజీపీకి వివరించారు. పనితీరును మరింత పటిష్టం చేసి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసుల పనితీరుపై డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ (ఏఆర్) భీంరావ్, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, నాగేందర్, పోలీసు అధికారులు ఉన్నారు.