అభ్యర్థులకు సూచనలు..
లాంగ్జంప్..
మహిళలు 4 మీటర్లు.. పురుషులు 6 మీటర్లు జంప్ చేయాలి.
షాట్పుట్..
మహిళలు 2.5 మీటర్ల దూరం, పురుషులు 4 మీటర్ల దూరం విసరాలి.
రన్నింగ్..
మహిళలు 800 మీటర్లను 5.20 నిమిషాల్లో.. పురుషులు 1,600 మీటర్లను 7.20 నిమిషాల్లో పూర్తి చేయాలి.
ఖాకీ యూనిఫాం వేసుకోవాలని యువత తపన పడుతున్నది. పోలీస్ కొలువు సాధించి సమాజ రక్షకులుగా నిలవాలని కలలు కంటున్నారు. యువతీయువకుల స్వప్నాన్ని నెరవేర్చడానికి తెలంగాణ సర్కారు పోలీసుశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ మేరకు గత ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అర్హత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షల్లో నెగ్గడానికి కఠోర సాధన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మైదానికి వెళ్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇందుకుగాను నిరుపేద అభ్యర్థుల కోసం సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. బీసీ స్టడీ సర్కిల్స్, బెటాలియన్, సింగరేణితోపాటు ప్రైవేట్ సంస్థలు కూడా వీరికి అండగా నిలుస్తున్నాయి. ఉచిత భోజన వసతితోపాటు నిష్ణాతులైన వారితో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ వారి ఉన్నతికి తోడ్పతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గడానికి సాధన చేస్తున్న అభ్యర్థులపై ప్రత్యేక కథనం.. నిర్మల్ అర్బన్/ఎదులాపురం, నవంబర్ 22ఎస్ఐ అవుతా..
పోలీస్ ఆఫీసర్ కావాలనేది నా కల. చిన్నప్పటి నుంచి ఖాకీ డ్రెస్ వేసుకోవాలని ఆరాటపడుతున్నా. బీటెక్ చదివా. సాఫ్ట్వేర్ మార్గంలో వెళ్లవచ్చు. కానీ.. పోలీస్ కొలువు సాధించాలనే తపనతో సాధన చేస్తున్నా. 2018లో ఎస్ఐ పరీక్ష రాశా. ఫిజికల్ టెస్ట్ పాస్ కాలేకపోయా. ఈ యేడాది ప్రిలిమినరీ పాస్ అయ్యా. గత పొరపాటు చేయకూడదని సాధన చేస్తున్నా. కచ్చితంగా ఎస్ఐ అవుతా.
– ఆర్ శ్రీనివాస్, ఎస్ఐ అభ్యర్థి, ఉడుంపూర్(కడెం మండలం)
మా ఊరిలో 60 మంది పీసీలు
క్రమ శిక్షణకు మారు పేరు పోలీస్. మా ఊరిలో దాదాపు 60 మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నరు. వారిని స్ఫూర్తిగా తీసుకొని పోలీస్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నా. గుడిపేట బెటాలియన్లో శిక్షణ తీసుకుంటున్న. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్న. తప్పక ఉద్యోగం సాధించి తీరుత.
చిలుకూరి సాయి చరణ్, రాజంపేట, దండేపల్లి
నిర్మల్ అర్బన్/ఎదులాపురం, నవంబర్ 22 : తెలంగాణ సర్కారు ఆగస్టు 7న ఎస్ఐ, 28న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎస్ఐ 12,313.. కానిస్టేబుల్ 47,638 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యారు. డిసెంబర్లో దేహదారుఢ్య(ఫిజికల్ టెస్ట్) ఉండగా.. పోలీసు కొలువు సాధించేందుకు క్వాలిఫైడ్ అభ్యర్థులు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఇందుకోసం స్టడీ సర్కిళ్లు, అకాడమీలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో ఎస్ఐకి 2,210.. కానిస్టేబుల్కు 9,421 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండింటికీ కలిసి దాదాపు 300 మంది అర్హత సాధించారు. జోనల్ విధానంలో 30 ఎస్ఐ.. 150 వరకు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నా యి. నిరుపేద విద్యార్థులకు నిర్మల్ జిల్లాలో అల్లోల, బీసీ స్టడీ సర్కిల్, ఎంఎం అకాడమీలు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాయి. ఎల్లపెల్లి వద్ద గల క్రషర్ మైదానంలో అల్లోల ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది శిక్షణ పొందుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో 50 మంది.. ఎంఎం డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 150 మంది మహిళా, పురుష అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్, పోలీస్ శిక్షణా కేంద్రంలో 1,355 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారు. ఇందులో ఎస్సీ స్టడీ సర్కిల్లో 400 మంది ప్రిలిమ్స్కు తర్ఫీదు పొందారు. ఇందులో 302 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్లో 375 మంది అభ్యర్థులకు 315 మంది ఫిజికల్ టెస్ట్కు అర్హత సాధించారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూర్ కేంద్రాల్లో 580 మంది ప్రిలిమ్స్కు పరీక్ష రాయగా 350 మంది ఎంపికయ్యారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేడియం, పోలీస్ శిక్షణా కేంద్రంలో ఫిజికల్ టెస్టుకు శిక్షణ తీసుకుంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో గల శ్రీ భీమన్న క్రీడా మైదానంలో శిక్షణ కొనసాగుతున్నది. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రిమిలినరీ క్వాలిఫైడ్ అభ్యర్థులు 11వ తేదీ నుంచి తర్ఫీదు పొందుతున్నారు. 142 మంది యువతీయువకులు నిత్యం ఉదయం, సాయంత్రం దేహదారుఢ్య శిక్షణతోపాటు మెయిన్స్కు నిర్వహించే తరగతులు వింటున్నారు. రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిపుణుల పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం సుదూర ప్రాంతాల అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లో వసతి కల్పించడంతోపాటు మైదానంలో ఉదయం బ్రెడ్లు, పాలు, కోడిగుడ్లు, అరటి పండ్లతోపాటు టిఫిన్ కూడా అందిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా హాజీపూర్లోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్లో పోలీస్ అభ్యర్థులు ఉచితంగా శిక్షణ తీసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు 3 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 758 మంది ఫిజికల్ టెస్ట్కు అర్హత సాధించారు. వీరందరూ కూడా డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వుల మేరకు అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ ఆదేశాలతో కలెక్టర్ భారతీ హోళికేరి ఆధ్వర్వంలో బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణ పర్యవేక్షణలో ఫిజికల్ ఫిట్నెస్, ఈవెంట్స్పై మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ పొందుతున్నారు. క్రీడా మైదానంలో రన్నింగ్, షాట్పుట్, లాంగ్ జంప్, యోగా, మెడిటేషన్పై శిక్షణ ఇస్తున్నారు. కమాడెంట్ రామకృష్ణతోపాటు అదనపు కమాడెంట్ ఎంఐ సురేశ్, అసిస్టెంట్ కమాడెంట్ రఘునాథ్ చౌహాన్ రోజు పర్యవేక్షిస్తున్నారు.
v రెండింటిలోఏదో ఒకటి పక్కా సాధిస్తా..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్కు శిక్షణ తీసుకున్న. రూపాయి ఖర్చు లేకుండా పేద ప్రజలకు అందించిన ఈ శిక్షణతో ఎస్ఐ, కానిస్టేబుల్కు అర్హత సాధించాను. రెండు పరీక్షల్లో ఏదో ఒకటి కచ్చితంగా సాధిస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఉద్యోగ ప్రకటన మాకు వరంగా భావిస్తున్న.
– పీ దీపిక ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థి బొప్పారం
v మంచి మార్కులు తెచ్చుకుంటా
కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నా. హైదరాబాద్కు వెళ్లి ప్రైవేట్గా కోచింగ్ తీసుకోకుండానే ఇక్కడే బీసీ స్డడీ సర్కిల్ శిక్షణ తీసుకున్నా. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన. ప్రస్తుతం పిజికల్ టెస్టు కోసం ఉదయం, సాయంత్రం శిక్షణ తీసుకుంటున్నా. కోచ్ చెప్పిన విధంగా సాధన చేస్తున్నా. మంచి మార్కులు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నా.
– సుప్రియ, కానిస్టేబుల్ అభ్యర్థి, ఆదిలాబాద్