ఎదులాపురం, నవంబర్ 19 : సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందించే విధంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్లో శనివారం ఆయన పర్యటించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే జోగు రామన్న కృషితో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు రాజన్న, ప్రమోద్, జవాన్, గంగారాజ్, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ సాజీద్, అంగన్వాడీ కార్యకర్త రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.