దస్తురాబాద్,నవంబర్ 16 : సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి మోసపోయింది. ఆన్లైన్ వ్యాపారం పేరిట నమ్మించడంతో, ఓ యాప్ ద్వారా ఏకంగా రూ. 4 లక్షలు కట్టింది. చివరకు వారిది ఫేక్ యాప్ అని తెలుసుకొని లబోదిబోమంటున్నది. పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు తెలిసింది. ఎస్ఐ జ్యోతిమణి కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన యువతి 2020లో డిగ్రీ పూర్తి చేసింది.
ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నది. గత నెల 18వ తేదీన తన మొబైల్ లో అప్నా జాబ్ సర్చ్, అలర్ట్ అనే యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. తన బయోడేటా ఫామ్ను ఇందులో అప్లోడ్ చేసింది., అదే రోజు తన మొబైల్కి ఓ మెస్సేజ్ వచ్చింది. ఆన్లైన్ వ్యాపారం(జాబ్) గురించి 919753751178 నంబర్ను సంప్రదించాలని అందులో ఉంది. ఈ నంబర్కు డయల్ చేయగానే వాట్సాప్/టెలిగ్రామ్ ద్వారా వారు ఒక లింక్ను పంపించారు.
ఆ లింక్ను ఓపెన్ చేయగానే ఫ్లిప్కార్ట్ మాల్ పార్ట్ టైం జాబ్ అని వచ్చింది. ఈ లింక్ను ఓపెన్ చేసి వ్యాపారం చేసుకోమని చెప్పారు. ఇందులో వ్యాపారం(జాబ్) చేయాలంటే డబ్బులు జమ చేయాలని చెప్పడంతో, వారు చెప్పిన విధంగా యువతి ఫాలో అయింది. ఆన్లైన్లో జాబ్ చేయడం ప్రారంభించింది. అక్టోబర్ 25 నుంచి ఫ్లిప్కార్ట్ మాల్ పార్ట్లో 56 సార్లు విడుతల వారీగా మొత్తం రూ. 3 లక్షల 97 వేల 700 జమ చేసింది.
మొదటిసారిగా యువతికి రూ.925 వచ్చాయి. తర్వాత యువతి దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని విత్డ్రా పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే చివరి టాస్క్ అని చెప్తూనే డబ్బులను కొల్లగొట్టారు. యువతికి సందేహం వచ్చి యూ ట్యూబ్లో వెతకగా ఆ యాప్ ఫేక్ అని తేలింది. వెంటనే దస్తురాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువత అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్కు వచ్చే లింకులు, మెసేజ్లను ఓపెన్ చేయవద్దన్నారు.