ఉట్నూర్, నవంబర్10 : గిరిజన రైతులు లాభసాటి వ్యవసాయ పంటలు వేయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం గిరిజన రైతులకు పండ్ల తోటల పెంపకం, చిరుధాన్యాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి మెరుగైన దిగుబడి పొందాలన్నారు.
సీఎం గిరి వికాసం పథకంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు బోర్లు, విద్యుత్ మోటర్లు అందించినట్లు చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మామిడి, జామ, వంటి పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే మూడు నుంచి నాలుగేళ్లలో రూ. 1.50 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. అలాగే పందుల బెడద ఉండదన్నారు. అంతర పంటలు వేసుకోవచ్చని వివరించారు. చిరు ధాన్యాల సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ కిష్టయ్య, ఈఈ భీంరావ్, హెచ్వో సుధీర్, దుర్గు పటేల్, అధికారులు పాల్గొన్నారు.
గురుకుల క్రీడాపోటీలకు ఏర్పాట్లు చేయాలి
ఉట్నూర్ రూరల్, నవంబర్10: ఈ నెల 12 నుంచి మండలంలోని లాల్టేక్డి గురుకుల పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. క్రీడా పోటీల ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. రాష్ట్ర స్థాయి గురుకుల క్రీడా పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పకడ్బందీంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, భోజనం, వసతి కల్పించాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్సీవో గంగాధర్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.