ఎదులాపురం, నవంబర్ 9 : లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పేదలకు సైతం న్యాయం అందుబాటులోకి వచ్చిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించిన జాతీయ న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. కోర్టుల్లో పేదలకు న్యాయం ఉండదన్న అపోహలను తొలగించి న్యాయ సహాయం ఎలా పొందాలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా సఖీ, చైల్డ్లైన్ డీఎల్ఎస్ఏకు సంబంధించిన స్టాల్స్ను తిలకించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మాధవికృష్ణ, సతీశ్ కుమార్, ప్రమీలజైన్, మంజుల, యశ్వంత్ సింగ్ చౌహాన్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నటరాజ్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, పీపీ రమణారెడ్డి, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ఉట్నూర్, నవంబర్ 9 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఉట్నూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు, లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ సైదారావ్, నార్నూర్ సీఐ ప్రేమ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి, న్యాయవాదులు శ్యాంలాల్ గుప్తా, దీరజ్ గుప్తా, జగన్, గిరి, జైవంత్రావ్, వసంత్రావ్, తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
బోథ్, నవంబర్ 9 : విద్యార్థినులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని బోథ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ సూచించారు. బోథ్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు హరీశ్, కుమ్మరి విజయ్కుమార్, బోథ్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రవీంద్రప్రసాద్, సర్పంచ్ సురేందర్యాదవ్, డాక్టర్ శైలజ, ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణ పాల్గొన్నారు.