తానూర్, నవంబర్ 8 : తానూర్ మండల కేంద్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వారం నుంచి నిర్వహిస్తున్న విఠలేశ్వరుని జాతర ముగిసింది. మంగళవారం వారసంత కూడా ఉండడంతో గతేడాది కంటే ఈ యేడు భక్తజనం అధికంగా కనిపించింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. సోమవారం రాత్రి గ్రామస్తులు జాగరణ చేశారు. మరుసటి రోజు వేకువ జామునే ఆలయంలో కాగడ హారతితో ఉత్సవాలు ముగించారు. చివరి రోజు జాతరకు సమీప గ్రామాలతో పాటు మహారాష్ట్ర వాసులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన రహదారిపై వెలిసిన దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడాయి. రంగుల రట్నాల వద్ద చిన్నారుల సందడి కనిపించింది. జాతర సందర్భంగా ప్రజలు తమ బంధువులను ఆహ్వానించడంతో ఇండ్లలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జాతరకు వచ్చిన ప్రజలకు ఆలయ కమిటీ, పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ తాడేవార్ విఠల్, మాజీ సర్పంచ్లు జాదవ్ మాధవ్రావు పటేల్, ధార్మోడ్ రాములు, ఆలయ కమిటీ చైర్మన్ పంగి పండరి, వీడీసీ మాజీ అధ్యక్షుడు శివాజీరావు పటేల్, పీఏసీఎస్ డైరెక్టర్ పుండలిక్, కార్యదర్శి జాదవ్ జాలాం సింగ్, గ్రామ పెద్దలు గోవింద్ పటేల్, అరుణ్ దేశ్పాండే, సోమ్నాథ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
విఠలేశ్వరుని జాతర సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నుంచి ప్రఖ్యాత మల్లయోధులు వచ్చి పోటీల్లో తలపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఈ పోటీలు రాత్రి వరకు సాగాయి. పోటీలను తిలకించేందుకు జనం తండోపతండాలుగా రావడంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ మొత్తం కిక్కిరిసిపోయింది. నిర్వాహకులు విజేతలకు మొదటి బహుమతిగా రూ. 11,111, ద్వితీయ బహుమతిగా రూ. 8851, వెండి కడియం అందించారు.
ఒంటి చేత్తో బరిలోకి..
మహారాష్ట్రలోని ధర్మాబాద్ నియోజకవర్గం కర్కెల్లి గ్రామానికి చెందిన గణేశ్కు కుస్తీ అంటే ప్రాణం. తన కుటుంబ సభ్యుల వద్ద కుస్తీ నేర్చుకొని చిన్నప్పటి నుంచి పోటీలకు హాజరవుతున్నాడు. ఐదారేళ్ల క్రితం రైలు ప్రమాదంలో గాయపడగా గణేశ్ కుడి చేయి కోల్పోయాడు. తానూర్లో నిర్వహించిన పోటీల్లో గణేశ్ ఒంటి చేయితో కుస్తీ పట్టి విజయం సాధించాడు. ఈ సందర్భంగా అతడిని పలువురు అభినందించారు.