కౌటాల, నవంబర్ 8 : గన్ మిస్ఫైర్ ఘటనలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సూర రజినీ కుమార్ (29) మృతి చెందాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కౌటాల పోలీస్ స్టేషన్లో మంచిర్యాల జిల్లా గుడిపేట బెటాలియన్లో ‘ఏ’ కంపెనీకి చెందిన టీఎస్ఎస్పీ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో రజినీ కుమార్ (29) పీసీ నంబర్ 2104 ఉదయం 3 నుంచి 5 గంటల వరకు నూతన పోలీస్ భవనంలో సెంట్రీ డ్యూటీకి ఎక్కాడు. ఉదయం 5 గంటలకు ఆయన డ్యూటీ దిగాల్సి ఉంది. అయితే దానికి ముందుగానే తర్వాత డ్యూటీ పీసీ అయిన పోరండ్ల సతీశ్ (పీసీ నంబర్ 2089)కు ఉదయం 4.53 నిమిషాలకు ఫోన్ కాల్ చేసి డ్యూటీ టైం అయింది రావాలని చెప్పాడు. ఆ వెంటనే సతీశ్ డ్యూటీకి వస్తుండగా.. 4.55 గంటలకు సెంట్రీ రూంలో పేలుడు శబ్ధం వచ్చింది.
సతీశ్ వెంటనే అక్కడకు వచ్చి చూడగా ఎస్ఎల్ఆర్ ఫైర్ అయి బుల్లెట్ రజినీ కుమార్ దవడలోంచి చొచ్చుకుపోయి నుదుటి పై భాగం నుంచి బయటకు వెళ్లింది. తీవ్ర గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్న రజినీ కుమార్ను చూసి తోటి కానిస్టేబుళ్లు, పోలీస్ స్టేషన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్కు సమాచారం అందించాడు. వెంటనే సీఐ బుద్ధే స్వామి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న రజినీ కుమార్ను కౌటాల నుంచి పోలీస్ వాహనంలో కాగజ్నగర్లో ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
అక్కడే రజినీ కుమార్ను ఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించి మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్లో కరీంనగర్ అపోలో దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి ఉదయం 10.40 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం మంచిర్యాల సర్కారు దవాఖానకు తరలించారు. కౌటాల పోలీస్ స్టేషన్లో ఘటనా జరిగిన స్థలాన్ని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ బుద్ధే స్వామితో కలిసి పరిశీలించారు. ఎస్ఎల్ఆర్ తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రజినీ కుమార్ జూలై 2021లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. 5 మే 2022 నుంచి కౌటాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రజినీ కుమార్ది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వన్పల్లి స్వస్థలం. రజినీ కుమార్ ఇటీవల ఎస్ఐ పరీక్షలో అర్హత సాధించాడు. యువ కానిస్టేబుల్ ఇలా మృతి చెందడంతో తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగి పోయారు.