ఎదులాపురం, నవంబర్ 3 : విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పతకాలు సాధించినప్పటికీ అవసరమైన మార్పు చెందుతున్న క్రీడాంశాలు, సాంకేతిక మెళకువలు, నిబంధనలు అవసరమని అన్నారు.
మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు తెలియజేయాల్సిన అంశాలను పాఠశాలల్లో అమలు పరచాలని సూచించారు. విద్యార్థుల నైపుణ్యాలను మరింతగా పెంచేలా వారికి ప్రతి నిత్యం శిక్షణ అందించాలని సూచించారు. నిత్య జీవితంలో భాగమైన వ్యాయామంపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పీఈటీలపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ , ట్రైనర్లు మల్లికార్జున్, భూమన్న, పేటా సంఘం అధ్యక్షుడు పార్థసారథి, కార్యదర్శి స్వామి, పీఈటీలు, పీడీలు, తదితరులు పాల్గొన్నారు.