ఎదులాపురం, నవంబర్ 3: సమగ్ర బాలల పరిరక్షణ సేవలు (ఐసీపీఎస్) జిల్లాలో సమర్థవంతంగా అమలవుతున్నాయి. అనాథ, వీధి బాలలు, తల్లిదండ్రులు వదిలివెళ్లిన వారు, ఆపదలో ఉన్న బాలలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలరక్షక్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని సిబ్బంది బాలల హక్కులపై ముందుగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, లైంగిక వేధింపులు, పిల్లల అక్రమ రవాణా, వివక్ష, నిర్లక్ష్యం, బడి మానేసిన పిల్లలు, వీధి పిల్లలు ఇలా 18 ఏళ్లలోపు బాధిత పిల్లలకు కమిటీ సభ్యులు. అన్ని రకాలుగా అండగా నిలుస్తారు. బాధిత చిన్నారులను ముందుగా సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్పేర్ కమిటీ) ముందు ప్రవేశ పెట్టి వారి నిర్ణయం మేరకు అ పిల్లలను పాఠశాల, వసతి గృహాల్లో చేర్పిస్తారు.
బాల్క్ష్రక్ వాహనం సేవల కోసం బాధితులే కాకుండా సామాజిక బాధ్యతగా 1098, 100, 181 నంబర్లకు ఫోన్ చేస్తే చాలు ఆ ప్రాంతానికి బాల్క్ష్రక్ వాహనంతో వెళ్లి వారిని అక్కున చేర్పుకుంటారు. బాదిత పిల్లల పరిస్థితులను బట్టి వారికి తక్షణ ఆర్థిక, నిత్యావసర సరుకులు అందిస్తారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం తరఫున రూ.2వేలు ప్రతి నెలా అందిస్తారు. కేసులను బట్టి వారిపై ఆరు నెలల నుంచి ఏడాది వరకు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇటీవల ఈ వాహనం ద్వారా ముగ్గురు బాధితులు సేవలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వాహనంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. ఇందులో చైల్ట్లైన్ సిబ్బంది, సోషల్ వర్కర్, పీవో, కౌన్సిలర్ ఉన్నారు. జిల్లాలో ఈ సేవలకు డీసీపీవో రాజేంద్రప్రసాద్ 9440555872, చైల్ట్లైన్ కో ఆర్డినేటర్ తిరుపతి 9989581713లను సంప్రదించాలి.
బాలల సంరక్షణ అందరి బాధ్యత. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలి. ఆపదలో ఉన్న 18 ఏండ్లలోపు బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలి. ప్రతి గ్రామంలో అంగన్వాడీ, ఆశ, స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతోనే బాలల సంరక్షణ సాధ్యమౌతుంది. ముందుగా పిల్లల హక్కులు, వాటి పరిరక్షణ, తదితర అంశాలపై గ్రామాల్లో ఈ కమిటీ సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. – రాజేంద్రప్రసాద్, బాలల సంరక్షణాధికారి (డీసీపీవో) ఆదిలాబాద్ జిల్లా