లోకేశ్వరం,అక్టోబర్ 30 : వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికొచ్చాయి. లోకేశ్వరం మండలం వ్యాప్తంగా ఈ యేడు వానకాలంలో సుమారు 12 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. పంచగుడి, కనకాపూర్, అబ్దుల్లాపూర్ తదితర గ్రామాలు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఈసారి వరి సాగు విపరీతంగా పెరిగింది. చెరువులు, బోర్ల కింద సైతం సాగయ్యింది. ఈ వర్షాకాలంలో వానలు సైతం సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఆరుగాలం శ్రమించి రైతన్నలు వరి సాగు చేయగా.. ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు చేతికి అందుతున్నాయి. నాలుగైదు రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరి కోతలను ముమ్మరం చేశారు. హార్వేస్టర్లతో పంట కోతలు చేస్తుండగా.. గంటకు రూ.1900 చెల్లిస్తున్నారు. ఇంకొందరు రైతులు వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.