బేల, అక్టోబర్30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామా ల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ నిధులతో పాటు దాతల సాయంతో పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలతో ప్రకృతి వనాలు కళకళలాడుతున్నాయి. బేల మండలం సాంగిడి పల్లె ప్రకృతి వనం ఆదర్శంగా నిలుస్తున్నది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామం పక్కనే పెన్గంగ ఒడ్డున పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో చల్లటి గాలిలో స్వేద తీర్చుకునేందుకు గ్రామస్తులు ఉదయం సాయత్రం వేళల్లో యువకులు, వృద్ధులు సేద తీరేందుకు గాను వీలుగా వసతులు ఏర్పాటు చేశారు. నిత్యం ప్రకృతి వనాలను వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు నూతన ఉత్సాహం కలుగుతున్నదని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని హంగులు..
సాంగిడి పల్లె ప్రకృతి వనంలో గ్రామస్తులు సేద తీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు గాను క్రీడ సామగ్రిని దాతల సహకారంతో సమకూరుస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామస్తులు వాకింగ్ చేసేందుకు గాను అందమైన రోడ్లను ఏర్పాటు చేశారు. చుట్టూ ఉన్న ప్రహారీకి ఆకట్టుకునేలా అందమైన పేయింటింగ్స్ వేశారు. ప్రకృతి వనాల్లో రకాల రకాల పూల మొక్కలతో అందంగా ఏర్పాటు చేశారు.
పండ్ల తోట ప్రత్యేకం…
సాంగిడి గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన పండ్ల తోట ప్రత్యేకం. ఈ పల్లె ప్రకృతి వనంలో జామ, అంజీర, ఉసిరి, సీతాఫలం మొక్కలతో పాటు, వివిధ రకాల పూల మొక్కలతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. సీజన్ బట్టి అక్కడి పండ్లను అక్కడి వచ్చేవారు తిని ఆనందంగా గడుపుతున్నారు. మండలంలోనే సాంగిడి పల్లె ప్రకృతి వనం ఆదర్శంగా నిలుస్తుంది.
అందంగా ముస్తాబు చేశాం..
సాంగిడి గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో నాటిన పండ్లు, రకరకాల పూల మొక్కలు ఏపుగా పెరిగాయి. ఉదయం, సాయంత్రం పిల్లలు అక్కడే ఆడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఈ ఏడాది మరిన్ని మొక్కలు పెంచి సుందరంగా తీర్చిదిద్దుతాం. గ్రామస్తులకు ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
కన్నల సుమన్బాయి (సాంగిడి, సర్పంచ్ )
సేద దీరుతున్నాం…
పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో అందరం అక్కడే కూర్చోని ఆనందంగా గడుపుతాం. పచ్చని మొక్కల నడుమ కూర్చుంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో స్నేహితులతో కలిసి ముచ్చటిస్తుంటాం. పల్లె ప్రకృవనంలో కూర్చోడంతో సమయమే తెలియదు.
-బాల్చందర్, సాంగిడి గ్రామస్తుడు
ప్రకృతి వనంతో కొత్త కళ
పల్లె ప్రకృతి వనంలో రకరకాల పూల మొక్కలతో పాటు, పండ్ల మొక్కలను నాటి పెంచుతున్నాం.చుట్టూ కంచె ఏర్పాటు చేసి జీపీ సిబ్బంది ద్వారా నిత్యం మొక్కలకు నీరందిస్తున్నాం. సాంగిడి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుతో పచ్చదనంతో పాటు కొత్తకళ సంతరించుకుంది.
రాకేశ్, ఎంపీటీసీ సాంగిడి