భీమారం, అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన భూక్యా రాజునాయక్ ఓ వైపు ఎల్ఎల్బీ చేస్తూనే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టాడు. తన భార్య రాజేశ్వరి బిహార్ రాష్ట్రంలోని రాజేంద్రప్రసాద్ సెంట్రల్ యూనిర్సిటీలో ఆగ్రో ఫారెస్ట్రీ (ఎంఎస్సీ) చదువుతున్నది. హార్టికల్చర్పై పట్టున్న ఆమె, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని తన భర్త రాజునాయక్కు సూచించి.. ప్రోత్సహించింది. దీంతో తమకున్న ఎకరంన్నరలో ప్రయోగాత్మకంగా అక్కడ ట్రెల్లింగ్ విధానంలో సాగు చేపట్టాడు. ఒక్కసారి సాగు వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి పొందే అవకాశంతోపాటు అంతర పం టలు కూడా వేసుకునే వెసులుబాటు ఉండడం తో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది జూలైలో సూర్యపేట జిల్లా రామచంద్రాపు రం నుంచి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మం డలం లింగన్నపేట నుంచి నాలుగు వేల మొక్కలు తీసుకొచ్చాడు. సీఎం రెడ్, తైవన్ పింక్, అమెరికన్ బ్యూటీ అనే మూడు జాతుల మొక్కలు నాటాడు. ఒక్కో మొక్కకు రూ.60 చొప్పున చెల్లించాడు. మొక్క మొక్కకూ సపోర్ట్గా కొయ్యలను ఏర్పాటు చేశాడు. నెట్ షెడ్ల కోసం మొత్తం 700 పోల్స్ నాటాడు. ఒక్కో పోల్కు రూ.700 దాకా ఖర్చు చేశాడు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనపుడు ఈ షేడ్ నెట్స్ ఉపయోగపడుతాయి. అలాగే సపోర్ట్ పోల్స్ 600 దాకా ఏర్పాటు చేశాడు. ఒక్కో పోల్కు రూ.250, తీగల పందిరి ఏర్పాటుకు రూ.70 వేలు, ట్రాన్స్ఫార్మర్, బోరు ఏర్పాటు కోసం రూ.2 లక్షలు, మందులకు రూ.40 వేలు, కూలీలు.. ఇతరవి కలిపి మొత్తం రూ.70 వేల దాకా ఖర్చవుతున్నట్లు రాజునాయక్ తెలిపాడు.
కంటికి రెప్పలా కాపాడుకోవాలి..
డ్రాగన్ ఫ్రూట్కు పెద్దగా చీడపీడలు ఆశించవు. అధిక వర్షాలు కురిసినప్పుడు, వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మాత్రం మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ట్రెల్లింగ్ విధానంలో పండిస్తున్న పంట కావడంతో గాలి.. వెలుతురు బాగా తగిలితే కాయ బాగా ఎదుగుతుంది. అదే రింగు పద్ధతి అయితే బయట ఉన్న కొమ్మలకే కాయలు వస్తాయి.
ఒక్కసారి నాటేతే 30 ఏళ్ల వరకు దిగుబడి..
డ్రాగన్ ప్రూట్ సాగుతో అధిక లాభాలు పొందే వీలుంది. నూటికి నూరు శాతం ఆర్గానిక్తోనే డ్రాగన్ సాగు చేస్తున్నాడు రాజునాయక్. ఆర్గానిక్ పద్ధతి ద్వారా సాగు చేస్తేనే ప్రజలు తినేందుకు వీలుంటుంది. వచ్చే మే నెలలో కాయలు కాసే అవకాశం ఉంది. మొదటి సంవత్సరంలో 2 నుంచి 4 టన్నుల దిగుబడి పొందే అవకాశముంది. మూడో ఏడాది నుంచి 8 టన్నుల నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని చెబుతున్నాడు. మొదటి ఏడాది పెట్టుబడి పెడితే చాలు.. 30 ఏళ్ల వరకు లాభాలు పొందవచ్చు. మే నుంచి నవంబర్ వరకు పండ్ల దిగుబడితో ఆదాయం అర్జిస్తే.. ఆ తర్వాత నర్సరీ మొక్కలను తయారు చేసి విక్రయించవచ్చు.
మార్కెట్లో మంచి డిమాండ్
ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఫ్రూట్కు సైజును బట్టి రూ.120-రూ.150 వరకు ధర పలుకుతుంది. ఇక అన్ సీజన్లో రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే తెలంగాణ సర్కారు ఈ పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం డ్రిప్లను మంజూరు చేస్తున్నది. జీఎస్టీ 18 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
నా భార్య సపోర్ట్తోనే..
నా భార్య రాజేశ్వరి సపోర్ట్తోనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న. ఆమె తెలంగాణలోని ములుగు కొండాలక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఈ పంట విధానం గురించి తెలుసుకొని నాకు చెప్పింది. నేను కూడా అక్కడికి వెళ్లి సాగు పద్ధతులు తెలుసుకున్న. ఎల్ఎల్బీ చదువుతూనే ఈ డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్న. నా తండ్రి భూక్య రాములు నాయక్ కూడా నాకు సహకరిస్తున్నాడు. అందరిలా కాకుండా కొత్త రకం పంట వేయాలనుకొని ఈ నిర్ణయం తీసుకున్న. వచ్చే ఏడాది మరో రెండు.. మూడు ఎకరాల్లో సాగు చేస్త. ఈ పంటలకు కోతులు, పందులు, పశువుల బెడద కూడా ఉండదని తెలిసింది. భవిష్యత్లో ఆగ్రోఫారెస్ట్ నర్సరీని ఏర్పాటు చేస్తా. – భూక్యా రాజునాయక్, బూర్గుపల్లి
రైతులు వినూత్నంగా ఆలోచించాలి
రైతులు వినూత్నంగా ఆలోచిస్తేనే లాభాలు పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్స్ కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తున్నది. 18 శాతం జీఎస్టీ మాత్రం సదరు రైతు కట్టుకోవాలి. ఈ పంటలకు చౌక, ఎర్ర, ఇసుక నేలాలు అనుకూలంగా ఉంటాయి. నీరు ఎక్కువ నిలిచే నేలాల్లో ఈ పంట సాగు చేయరాదు. చెన్నూర్ నియోజకవర్గ రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ప్రూట్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాయ సైజును బట్టి రేటు నిర్ణయిస్తారు.