బేల, అక్టోబర్ 29: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని అటవీ ప్రాంతమైన తోయిగూడకు చెందిన ఆయుర్వేద డాక్టర్ బోయర్ ఈశ్వర్ ఇంటినే నందనవనంలా మార్చుకున్నాడు. ఇంటికి వచ్చేవారిని ‘ఆహా ఏమి ఇల్లు’ అని మైమరిపించేలా తీర్చిదిద్దాడు. ఇంటి ఎదుట ఉన్న కొద్దిపాటి స్థలంలో పూలతోపాటు 180 రకాల ఆయుర్వేద మొక్కలు పెంచుతున్నాడు. ఇందుకు ఆయనకు భార్య మనీష సహకరిస్తున్నారు. పూలు, పండ్లు, తీగజాతి, ఆయుర్వేద మొక్కలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. ఆయన వద్దకు వచ్చే రోగులకు ఉచితంగా మూలికలు ఇస్తారు. విద్యుత్ వాడకానికి సౌర పలకలు(సోలార్) ఏర్పాటు చేసుకున్నారు. పక్షుల కోసం ప్రత్యేకంగా స్థావరాలు, నీళ్లలో ఉండే వాటికి చిన్న కొలను నిర్మించారు. ప్లాస్టిక్ సీసాలతో అందమైన ఆకృతులను తయారు చేసి, అందంగా తీర్చిదిద్దారు. మొసళ్లు, పిచ్చుకల బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొక్కలు పెంచుకుంటామని ఎవరైనా ఇంటికి వస్తే ఉచితంగా అందిస్తున్నారు.
ఆయుర్వేదంలో ఆయనే మేటి..
ఈశ్వర్ వద్ద దొరకని మూలికా వైద్యం లేదు. క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధిని కూడా తన ఆయుర్వేదంతో నయం చేస్తానని చెబుతున్నారు. ఇతర జిల్లాలతోపాటు విదేశాలకు కూడా మూలికా వైద్యం విస్తరించింది. డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఆయుర్వేద చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో సేవలను విస్తృతం చేయడం లేదని చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లోని కొబ్బరి చెట్లపై వందలాది పిచ్చుక గూళ్లు కనిపిస్తాయి. అనేకానేక పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయి. ప్రత్యేకంగా లవ్ బర్డ్స్ కోసం ఒక జాలీ వలయం ఏర్పాటు చేశారు. వీటి సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం ఒకరు కాపలా కాస్తున్నట్లు సైకిల్పై ఉన్న ఒక బొమ్మ ఏర్పాటు చేశాడు.
మొక్కలతోనే ఆయురారోగ్యాలు
25 ఏళ్లుగా రకరకాల మొక్కలు పెంచుతున్నాను. ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించిన అనేక రకాలు ఉన్నాయి. పెంచుకుంటామని అడిగిన వాళ్లకు ఉచితంగా ఇస్తున్నా. చాలా మంది ఆయుర్వేద మందుల కోసం వస్తున్నారు. వారికి ఉచితంగా మందులను అందిస్తున్నా. హరితహారం కంటే ముందు నుంచే ఈ మొక్కలు పెంచుతున్నా. వివిధ రకాల జంట పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి.
– బోయర్ ఈశ్వర్