బేల, అక్టోబర్ 29: జైనథ్ శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం జాతరకు ముస్తాబవుతోంది. జిల్లాలో అత్యంత ప్రాచీన కళలకు నిదర్శనంగా నిలిచే ఆలయంగా ప్రసిద్ధి. ఆలయ ఉన్నత శిఖరం కలిగి ఉండి శిల్పకళలతో శోభితమై ఉంటుంది. ప్రతి యేడులానే ఈ ఏడాది కూడా నవంబర్ 5 నుంచి స్వామివారి రథోత్సవం, జాతర నిర్వహించేందుకు ఆలయకమిటీ, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
ఆలయ చరిత్ర..
అత్యంత ప్రాచీనకళలకు జైనథ్ శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆ లయం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం పల్లవులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈఆలయ విశిష్టతల్లో చెప్పుకోదగ్గది స్వామివారి పాదాలను సూర్యకిరణాలు ఏడాదిలో నాలుగుసార్లు మాత్రమే తగులుతాయి. దీంతో స్వామివారిని సూర్యనారాయణ స్వామిగా కూడా పిలుస్తారు. 11, 13వ శతాబ్ధాల్లో మహారాష్ట్రలోని వేవత్మాలపంత్ అనే నల్లరాతితో ని ర్మించారు. ఆలయం ముందుభాగాన పెద్ద జలాశయం(కోనేరు) ఉంది. నేడు అది చెరువుగా రూపాంతరం చెందింది.
ఆలయ విశిష్టత..
లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. స్వామివారి విగ్రహం దక్షిణ దిశలో లక్ష్మీదేవి, అళ్వారులు, అన్యదేవత మూర్తులున్నాయి. మండలం అంతర్భాగాన స్తంభంపై హనుమంతుడు, రంభ, అప్సరసల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇరువైపులా శృంగార చిత్రాలు ఉన్నాయి.
ఆలయ ప్రత్యేకతలు..
సంతానం లేనివారు భక్తితో స్వామివారి కల్యాణోత్సవం రోజున గరుడముద్ద స్వీకరించినచో సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున నాగవెళ్లి కార్యక్రమంలో స్వామివారిని ధ్యానిస్తూ పూలదండ ధరిస్తే కూడా తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మకం. కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు. వందలాది జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
బ్రహ్మోత్సవాలు..
కార్తీకమాసంలో స్వామివారి బహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. కార్తీక ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు ద్వాదశి రోజున స్వామివారి కల్యాణం, బహుళ పంచమిరోజు స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. జిల్లా నలుమూలల నుం చే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పాల్గొంటారు.
కొనసాగుతున్న ఏర్పాట్లు..
స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పెద్దసంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణం నాటికి అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.