సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగవివక్ష, హింస, వేధింపులను బాల్యదశ నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్ను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో హెచ్ఎం, ఒక ఉపాధ్యాయిని, తరగతికి ఇద్దరు విద్యార్థినులు, షీటీం సభ్యులు ఉండనున్నారు. సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, అప్రమత్తంగా ఉండాల్సిన విధానం, ఆపదలో స్పందించాల్సిన తీరు, తదితరాలపై అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇచ్చోడ,అక్టోబర్ 28: సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, లైంగికదాడులు, బాల్యవివాహాలు,లింగ వివక్ష, ఆరోగ్య సమస్యలు, వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఉమ్మడి జిల్లాలో బాలికా సాధికారత క్లబ్ (కమిటీలు) ఏర్పాటు చేయనున్నారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో ఈ క్లబ్ పని చేయనుంది.ఈ కమిటీలో ప్రతి తరగతి గది నుంచి ఇద్దరు చురుకైన అమ్మాయిలు సభ్యులుగా ఉంటారు. వీరే పాఠశాల బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో పాఠశాల ప్రధానోపాయుడు చైర్మన్గా, ఒక ఉపాధ్యాయిని మెంబర్ కన్వీనర్గా ఉంటారు. ఈ కమిటీ ఫిబ్రవరి వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు(నెలకొకటి) నిర్వహిస్తుంది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో పాఠశాలల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయిని, ప్రతి తరగతి నుంచి ఇద్దరు చురుకైన విద్యార్థినులు, షీ టీమ్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. 100, 1098,181 వంటి టోల్ ఫ్రీ నంబర్లను పాఠశాలలో ప్రదర్శిస్తారు.
అక్టోబర్ 21 నుంచి 2023 ఫిబ్రవరి 10 వరకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే ఈ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఎదుగుదలతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత. జీవన నైపుణ్యంపై ఉపాధ్యాయల ఆధ్వర్యంలో డాక్టర్లు నవంబర్11న అవగాహన కల్పించనున్నారు. బాలికల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సహచరుల ఒత్తిళ్లకు ‘నో’ చెప్పడం, తదితరాలపై డిసెంబర్ 9న నేర్పనున్నారు. జనవరి 6న శిశు సంక్షేమశాఖ ప్రతినిధితో ఓరియంటేషన్, లైంగికదాడులు అడ్డుకోవడంపై అవగాహన సదస్సులు, జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు బాల్యవివాహాలు, హింస, తదితర సమస్యలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 10న ఇంత వరకు పాఠశాల చేసిన కార్యక్రమాలపై చర్చిస్తారు.
సాధికారతే లక్ష్యంగా క్లబ్బుల ఏర్పాటు
జిల్లాలో అన్ని ప్రభుత్వ జడ్పీ ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో బాలికల సాధికారత క్లబ్బులు(కమిటీలు) ఏర్పాటు చేశాం. ఇందులో పాఠశాల హెచ్ఎం చైర్మన్, ఉపాధ్యాయిని మెంబర్ కన్వీనర్గా, తరగతికి ఇద్దరు బాలికలు సభ్యులుగా ఉంటారు. షీటీం సభ్యులు కూడా ఇందులో భాగస్వాములవుతారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి వరకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
-ఉదయ్ శ్రీ, కేజీబీవీ ప్రత్యేకాధికారి, ఆదిలాబాద్
పాఠశాలల్లో బాలికల సాధికారత కమిటీలను పాఠశాల ప్రత్యేధికారి సంధ్యారాణి మేడమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన్రు. బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు,పరిష్కారంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కమిటీల ద్వారా మాకు ఎంతో లాభం ఉంది. బాల్యంలో అప్రమత్తంగా ఉండే విధానంపై కొంత అవగాహన వస్తుంది. సమాజం తీరుపై కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. షీటీం సభ్యులను భాగస్వాములను చేస్తే ధైర్యంగా ఉండే వీలుంటుంది.
– నేహతాయి, పదో తరగతి
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే పాఠశాలలో బాలికల సాధికారత కమిటీలు వేశాం. బాలికల సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడుతాయి. కమిటీలో ఉన్న బాలికలకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. బాలికలను సమాజంలో గౌరవించాలి. ప్రతి ఇంట్లో మగ పిల్లలకు ఆడపిల్లలను గౌరవించాలని తల్లిదండ్రులు నేర్పించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. పాఠశాలల్లో కచ్చితంగా ఆ దిశగా మేం ప్రయత్నిస్తూనే ఉంటాం. కమిటీల ఏర్పాటు బాలికలకు ఎంతో మేలు చేకూరుస్తాయని భావిస్తున్నా.
– జీ మల్లిక, కేజీబీవీ ప్రత్యేకాధికారి,ఇచ్చోడ