ఎదులాపురం, అక్టోబర్ 28 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మేనమామ లాగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా పింఛన్లు అందజేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న కృషితోనే అదిలాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు సంబంధించిన 11,734 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు రాంకుమార్, ధమ్మపాల్, తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా న్యూ హౌసింగ్బోర్డు జోన్-1లో చేపట్టిన అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్ పవన్ నాయక్ పరిశీలించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానతో పాటు పెద్ద డ్రైనేజీ పనులను పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కుమ్మరివాడలోని చర్చిలో గ్రాస్ కటింగ్ పనులు పరిశీలించారు. ఆయన వెంట వార్డు అధ్యక్షుడు రుక్మారెడ్డి, తదితరుల ఉన్నారు.