నార్నూర్, అక్టోబర్ 28 : గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజా క్షేమం కోసమే పోలీసులు సేవ చేస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపల్లి పంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీతో పాటు మండల పోలీసు అధికారులకు కొలాం గిరిజనులు ఘన స్వాగతం పలికారు. సుంగపూర్, నార్నూర్, నడ్డంగూడ, భీంపూర్ కొలాంగూడ, ఎంపల్లి కొలాంగూడ, గణపతిగూడ, ముక్తాపూర్ కొలాంగూడతో పాటు అనుబంధ గ్రామాలకు చెందిన 300 మందికి బ్లాంకెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువత సమయాన్ని వృథా చేయకుండా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. మండలంలోని ఆదివాసీ యువత కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ స్థానిక డీటీసీలో ఉచితంగా శారీరక, తుది పరీక్ష కోసం శిక్షణ త్వరలోనే అందిస్తామని తెలిపారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీలో 159 మంది అభ్యర్థులు స్థానిక డీటీసీలో పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. నేటితరం యువత ఖాళీగా ఉండకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం, వ్యవసాయంలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ప్రతి నెలా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా సమాజహిత కార్యక్రమాలు నిర్వహించి ఆదివాసీలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు. త్వరలోనే మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సరైన సీజన్లో కొలాం గిరిజనులకు దుప్పట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు.
రికార్డులు పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ సేవలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ కే ప్రేమ్కుమార్, గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్, ఖైరదట్వా సర్పంచ్ కనక సేవంత-ప్రభాకర్, ఎంపల్లి సర్పంచ్ రాథోడ్ గోవింద్నాయక్, గంగపూర్ సర్పంచ్ ఉర్వేత రూప్దేవ్, బలాన్పూర్ సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, రాయిసెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గుపటేల్, మాజీ ఎంపీపీ మీరాబాయి, మడావి పైకు, బాపురావ్పటేల్, కొలాం గిరిజన సంఘం మండలాధ్యక్షుడు మడావి రాము, కొలాం మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆత్రం నాగుబాయి, సోనేరావ్పటేల్ తదితరులున్నారు.