తపాలా శాఖ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.399కే రూ.10 లక్షల యాక్సిడెంటల్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని నిర్ణయించింది. స్వల్ప ప్రీమియంతో అధిక ప్రయోజనాలుండే బీమాను అందుబాటులోకి తీసుకురాగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నార్నూర్, అక్టోబర్ 28 : కరోనా నేపథ్యంలో ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీలపై దృష్టి పెట్టారు. కొత్త కొత్త బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు. అందుకనుగుణంగా తపాలా శాఖ ప్రజలకు ఎన్నో బహుళ ప్రయోజనాలను కల్పిస్తున్నది. పోస్టాఫీసుల్లో పొదుపు చేసుకునే డబ్బుకు మరింత భద్రత కల్పించడమే కాకుండా రెట్టింపు లాభాలను మోసుకొస్తున్నది. ప్రమాద బీమా, సుకన్య సమృద్ధి యోజన, పీఎంజేజేబీవై, ఏపీవై, సేవింగ్స్ బ్యాంకు ఖాతా, తదితర రంగాలతో పాటు తాజాగా.. తీసుకవచ్చిన ‘సామూహిక ప్రమాద బీమా’ పాలసీలు మరింత చేరువవుతున్నాయి. వార్షిక ప్రీమియం రూ. 399 చెల్లిస్తే అదనపు లబ్ధి, రూ. 299 చెల్లించే వారికి కొన్ని ప్రయోజనాలుండవు. రెండింటిలో ఏది తీసుకున్నా రూ. 10 లక్షల బీమా వర్తిస్తుంది. బీమా కోసం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) ద్వారా ఆ ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచిర్యాల ప్రధాన తపాలా కార్యాలయంతోపాటు 33 సబ్ పోస్టాఫీసులు, 220 బ్రాంచ్ పోస్టాఫీసులున్నాయి. ఇప్పటి వరకు 4,352 మంది బీమా తీసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ సబ్డివిజన్లో సుమారు 2 వేల మంది బీమా తీసుకున్నారు.
ఈ ప్రమాద బీమాకు 18-65 ఏండ్ల మధ్య వయసు వారు అర్హులు. ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్, పోలీసు శాఖల్లో పని చేసేవారితోపాటు సాహస క్రీడల్లో పాల్గొనేవారు, డ్రైవింగ్ వృత్తితో సంబంధం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. అంతే కాకుండా ఆత్మహత్య చేసుకున్నా, నేరం, అల్లర్లు, పేలుళ్లలో చనిపోయినా, దోమకాటుతో వచ్చే వ్యాధులతో, డ్రగ్స్, ఆల్కాహాల్ ప్రభావంతో మరణించినా, ప్రసవ సమయంలో, గర్భం వల్ల కలిగే హాని, ఎముకల(బోన్స్) వ్యాధితో మృతి చెందినా బీమా వర్తించదు.
సామూహిక ప్రమాద బీమా పథకం ఎంతో ప్రయోజనకరమైంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధిపొందే అవకాశముంది. పేద, మధ్య తరగతి వారు, గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లి ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవచ్చు. లేదా పోస్ట్మెన్కు ఫోన్ చేస్తే వారే ఇంటికి వచ్చి సేవలందిస్తారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ బీమా పథకంలో చేరాలి. ఈ అవకాశాన్ని మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకట స్వామి, ఐపీపీబీ మేనేజర్, మంచిర్యాల
ప్రమాద బీమా పథకం ఎంతో ప్రయోజనకరమైంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధిపొందే అవకాశముంది. పేద, మధ్య తరగతి వారు, గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లి ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవచ్చు. లేదా పోస్ట్మెన్కు ఫోన్ చేస్తే వారే ఇంటికి వచ్చి సేవలందిస్తారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఈ బీమా పథకంలో చేరాలి.
– సుజిత్కుమార్, ఐపీవో సబ్డివిజన్, ఆదిలాబాద్
ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ. 10 లక్షలు చెల్లిస్తారు.
ప్రమాదం జరిగి బీమా తీసుకున్న వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఐపీడీ (ఇన్ పేషెంట్ డిపార్టుమెంటు) కింద రూ. 60 వేలు, ఓపీ (ఔట్ పేషెంట్) కింద రూ. 30 వేలు ఇస్తారు.