కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. నిరుపేదలెవ్వరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేపడుతున్నది. ఈ మేరకు రెండున్నరేళ్లుగా రూపాయి తీసుకోకుండా ఒక్కొక్కరికీ 10 కిలోల చొప్పున అందిస్తూ వస్తున్నది. మొదట సెప్టెంబర్ వరకే ఇవ్వాలని అనుకున్నా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ వరకు కొనసాగించేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేసింది. ఆపత్కాలం నుంచి అన్నం పెడుతూ భరోసానిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ లబ్ధిదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండున్నరేళ్ల క్రితం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఎంతో మందిని బలితీసుకుంది. ఆ వైరస్ పుణ్యమా అంటూ వచ్చిన లాక్డౌన్.. చేతిలో పనులు లేకుండా చేసింది. దీంతో కూలీలు, ఆటోడ్రైవర్లు, హమాలీలు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వ లేక చతికిల పడిపోయాయి. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు అన్నమో రామచంద్ర అనే దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. తిండికిలేక ఎవరూ ఇబ్బందులు పడొద్దనే సదుద్దేశంతో ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీని చేపట్టింది. 2020లో మొదలైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ మధ్యే సీఎం కేసీఆర్ డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో పేదింట ఆనందం రెట్టింపు అయ్యింది. కష్టకాలంలో తమకు అండగా ఉంటున్న సర్కారుకు రుణపడి ఉంటామని వివిధ వర్గాల ప్రజలు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ 5 కిలోలు ఉచిత బియ్యం ఇవ్వాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 10 కిలోలకు పెంచింది. ఈ మేరకు అదనపు భారాన్ని సైతం భరిస్తున్నది. కొన్ని నెలలు మినహా రెండున్నరేళ్లుగా ఉచిత రేషన్ బియ్యం అందజేస్తూ వస్తున్నది. ఈ ఏడాది ఒక్క మే నెల మినహా ఇప్పటి వరకు ప్రతి నెలా బియ్యం ఉచితంగా సరఫరా చేసింది. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉచిత పంపిణీని కొనసాగించాలనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ డిసెంబర్ వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.227.25 కోట్ల అదనపు భారం పడనుంది. మంచిర్యాల జిల్లాలో ప్రతినెలా సగటున 70 వేల క్వింటాళ్లు, నిర్మల్లో 66 వేల క్వింటాళ్లు, ఆదిలాబాద్లో 55 వేల క్వింటాళ్లు, ఆసిఫాబాద్లో 37 వేల క్వింటాళ్ల వర కు బియ్యం లబ్ధిదారులకు చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. అం త్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, ఏఏపీ (అన్నపూర్ణ) 10 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు.
దండేపల్లి, అక్టోబర్ 28 : తెలంగాణ సర్కారు ఇస్తున్న బియ్యం ఎంతో ఆసరాగా అవుతున్నాయి. కరోనా కాలం నుంచే సర్కారు ఉచితంగా బియ్యం ఇస్తున్నది. గతంలో కిలోకు రూపాయి చొప్పున తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఉట్టిగనే ఇస్తున్నరు. గా బియ్యంతో మా కడుపునిండుతున్నది. మా కుటుంబంలో ఇద్దరికి 10 కిలోల చొప్పున 20 కిలోల బియ్యం వస్తున్నయ్. పేదోళ్లకు కడుపు నిండా బువ్వ పెడుతున్న సీఎం సారుకు రుణపడి ఉంటాం.
-ఇండ్ల అమృతవ్వ, తాళ్లపేట
కోటపల్లి, అక్టోబర్ 28 : కూలీపని చేసుకొని బతికే మాకు ప్రభుత్వం ప్రతినెలా 40 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తోంది. మా ఇంట్లో నలుగురం ఉన్నం. మాకు ప్రభుత్వం అందించే బియ్యం నెల రోజులకు సరిపోతున్నయ్. గతంలో ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇచ్చేటోళ్లు. ఈ బియ్యం ఎటూ సరిపోకపోయేది. మాలాంటి పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– తోకల విమల, షట్పల్లి
కోటపల్లి, అక్టోబర్ 28 : ఇది వరకు మనిషికి ఆరు కిలోల బి య్యం పంపిణీ చేసేటో ళ్లు. ఆ బియ్యం మాకు ఎటూ సరిపోకపోయేది. ప్రభుత్వం 6 కిలోల బియ్యం కోటాను 10 కిలోలకు పెంచడంతో పాటు ఉచితంగా ఇస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఉచితంగా ఇచ్చుడు గొప్ప విషయం. టీఆర్ఎస్ సర్కారు పేదోళ్లకు ఎప్పుడూ అండగ ఉంటది.
– మేడ అంకు, షట్పల్లిషట్పల్లి
టీఆర్ఎస్ సర్కారు గరీబోళ్లకు అండగా ఉంటుంది. నెల నెలా ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఫ్రీగా ఇవ్వడంతో కొంత భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు, కేంద్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున ఇస్తుంది. పేదోళ్లకు ఈ రేషన్ బియ్యం ఎంతో అవసరమవుతున్నాయి. పేదోళ్ల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న గీ సర్కారుకు రుణపడి ఉంటం.సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రేషన్షాపుల్లో కొన్ని నిల్వలు ఉన్నాయి. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 10 కిలోల చొప్పున అందజేస్తాం. లబ్ధిదారులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రేమ్కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి, మంచిర్యాల