ఇచ్చోడ, అక్టోబర్ 23 : ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీని వినియోగించుకొని అనేక మంది సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. దీంతో పోలీసులు సైబర్ నేరాలపై దృష్టి సారించారు. ప్రజలు వారి వలలోపడకుండా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సెల్ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే అనవసరమైన లింకులు క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలపై వివరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఫేస్బుక్, వాట్సాప్లో చాటింగ్, కాల్స్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని..
సైబర్ నేరగాళ్లు ప్రజలను సులువుగా దోచేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో బురిడికొట్టిస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు అందరి దగ్గరి నుంచి డబ్బులాగేస్తున్నారు. ‘మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఆధార్ నంబర్ చెప్పండి.. మీ సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పిండి.. మీ ఏటీఎం పని చేయడం లేదు’ అంటూ వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారు.
1930 టోల్ ఫ్రీ నంబర్
ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలే కాకుండా ట్రాఫిక్ నియమాలు, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలు, ధరించకుంటే కలిగే ప్రమాదాల గురించి వాహదారులకు తెలియజేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఎంసీఆర్పీలో వివరాలు ఆప్లోడ్ చేస్తే 24 గంటల్లోనే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
2022లో నమోదైన సైబర్ నేరాలు
ఆదిలాబాద్ వన్ టౌన్ 4, ఆదిలాబాద్ టూ టౌన్ 2, ఆదిలాబాద్ రూరల్ 1, బజార్ హత్నూర్ 1, బేల1, బోథ్ 3, గుడిహత్నూర్ 2, ఇంద్రవెల్లి 1, ఇచ్చోడ 1, మావల 2, నార్నూర్ 3, సిరికొండ 1, ఉట్నూర్ 1, మొత్తం 23 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కేసులు నమోదు కాని సైబర్ కేసులు చాలా ఉంటాయని సమాచారం.
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
సైబర్ నేరగాళ్ల చేతిలో ఎవరూ మోసపోకుండా అవగాహన కలిగి ఉండాలి. పోలీసుల ఆధ్వర్యంలో వాహన చట్టాలు, సైబర్ నేరగాళ్లపై అవగాహన కల్పిస్తున్నాం. బ్యాంకు నుంచి ఫోన్ చేశామని ఓటీపీ చెప్పాలంటూ కాల్ వస్త్తే స్పందించకూడదు. బ్యాంకు నుంచి అధికారులు ఫోన్లు చేయరు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నంబర్కకు ఫోన్ చేయాలి, పోలీసులను ఆశ్రయించాలి. -ముదావత్ నైలు, ఇచ్చోడ సీఐఅవగాహన కల్పిస్తున్నారు.
పోలీసులు సైబర్ నేరాలతో పాటు వాహన చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఎంసీఆర్పీలో వివరాలు ఆప్లోడ్ చేస్తే 24 గంటల్లోనే అమౌంట్ రిటన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నారు.
-ఇంకోల్లే సూర్యకాంత్, పొన్న, రైతు