ఇంద్రవెల్లి/నార్నూర్, అక్టోబర్ 23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గూడేల్లో దండారీ సంబురాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా ఆలయంలో నార్నూర్ మండలంలోని మాన్నాపూర్, ఖైర్దాట్వా, చిత్తగూడ(బాబేఝరి), ఉట్నూర్ మండలంలోని ఉమ్రి , తదితర గ్రామాలకు చెందిన గుస్సాడీ బృందాలు పాల్గొన్నాయి. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం రాత్రి తరలివచ్చిన గుస్సాడీ, దండారీ బృందం సభ్యులు నాగోబాకు నైవేద్యాలు సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం అవరణలో గుస్సాడీ దండారీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వరకు ఘనంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేశారు. ఆలయ అవరణలో సామూహిక వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, ఏఎంసీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, ఆలయ పూజారి మెస్రం షేకు, ఆదివాసీ గిరిజన పెద్దలు మెస్రం రూప్దేవ్పటేల్, కోట్నాక్ నానాజీపటేల్, నారింజీపటేల్, గోపాల్పటేల్, భీంరావ్పటేల్, సార్మేడి మడావి తుకారాం, మెస్రం వంశీయులు బాధిరావ్పటేల్, కోశరావ్, హనుమంత్రావ్, నాగ్నాథ్, ఆనంద్రావ్, లింబారావ్, గణపతి, డిగంబర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఖాందేవ్ ఆలయంలో..
వాంకిడి మండలంలోని దేవాపూర్కు చెందిన గుస్సాడీ బృందాలు ఆదివారం నార్నూర్ మండల కేంద్రంలోని ఖాందేవ్ ఆలయంలో దండారీ ఉత్సవాలు నిర్వహించాయి. ఖాందేవ్ ప్రతిమలకు సంప్రదాయ పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ సభ్యులు దండారీ బృందం సభ్యులను ఆహ్వానించారు. గుస్సాడీలు నృత్యాలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించి, నైవెద్యాన్ని సమర్పించారు. సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో తొడసం యశ్వంత్పటేల్, తొడసం రఘు, శేకు, చిత్రు, తొడసం బండు, మెస్రం నాగోరావ్ తదితరులున్నారు.