నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సిర్పెల్లి క్లస్టర్ పూర్తిగా గిరిజన ప్రాంతం. ఇక్కడి వారికి నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యమందిస్తున్నారు ఏఎన్ఎం మంగమణి. అదే ఆమెను వారి నోటి నుంచి మంగమ్మ డాక్టర్ అని ఆప్యాయంగా పిలిచేలా చేసింది. 17 ఏండ్లుగా ఆ ప్రాంత వాసులతో కలిసిపోయి, అనారోగ్యమైనా, కాన్పులైనా నేనున్నానంటూ సేవలందిస్తున్నది. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలా మంది ముందుకు రాని సందర్భంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి అవగాహన కల్పించి వందశాతం పూర్తి చేయడం ఆమె పనితీరుకు అద్దం పడుతున్నది. ఇదే ఆమెను ఉత్తమ ఏఎన్ఎం అవార్డు అందుకునేలా చేసింది.
కుభీర్, అక్టోబర్ 22: అడవులు, గుట్టలు, వన్యప్రాణుల సంచారం మధ్యన ప్రకృతి ఒడే ఆవాసంగా నివసించే గిరిజనులకు తనదైన శైలిలో వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఏఎన్ఎం మంగమణి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి గిరిజన క్లస్టర్ ఆరోగ్య ఉప కేంద్రంలో 17 ఏండ్లుగా సీనియర్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. గిరిజనులతో కలిసిపోయి వారి పండుగలు, ఆచార వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నారు. కొవిడ్ సమయంలో జాంగాంలో కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు అక్కడ అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ వేయించే బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకొని, వారి అనుమానాలను నివృత్తి చేశారు.
మెల్లమెల్లగా ఒక్కరిద్దరికి వ్యాక్సిన్ వేస్తూ 100 శాతం పూర్తి చేయించిన ఘనత ఆమె సొంతం. విధులపై అంకిత భావంతో పేరు తెచ్చుకున్న ఆమెను అంద రూ గౌరవంగా చూస్తారు. నిత్యం సబ్ సెంటర్కు వెళ్లి అక్కడ మాత్రలు అందించి అక్కడి నుంచి ఫీవర్, జ్వరాలు ఇతర జబ్బులతో మంచాలపై ఉన్న వారి దగ్గరికి వెళ్లి వారిని భైంసా, కుభీర్ ప్రభుత్వ దవాఖానలకు పంపిస్తుంది. అందుకే ఇక్కడి ఆరు తండాల గిరిజనులు ‘మంగమ్మ డాక్టర్’ అని పిలుస్తారు. ఏ రాత్రి ఫోన్ చేసినా పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యం చేయించే మంగమణి గిరిజనుల మనసుల్లో స్థానం పొందిం ది. ప్రతి గిరిజన యువతికి నార్మల్ డెలివరీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే 90 శాతం నార్మల్ డెలివరీలు చేయించి ప్రథమ స్థానంలో ఉంది. పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత, తదితరాలపై అవగాహన కల్పించి అధికారుల ప్రశంసలు పొందుతున్నది.
ఉత్తమ ఏఎన్ఎంగా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నాపై బాధ్యత మరింత పెరిగింది. ఇక్కడ గిరిజన మహిళలు ఇచ్చే గౌరవం, గుర్తింపు కన్నా అవార్డు రావడం తక్కువనే చెప్పాలి. సిర్పెల్లి, సిర్పెల్లి తండాలలో సూచనలు, సలహాలు ఇస్తూ 90 శాతం నార్మల్ డెలివరీలు అయ్యేట్లు చూస్తున్నా. వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోసులను వేయించా. ఈగిరిజన తండాలో అందరూ వారిలో ఒకదానిలా చూసుకుంటారు. 17 ఏండ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నేను పుట్టి, పెరిగింది ఉట్నూరు. అందుకే నాకు గిరిజనులంటే ఇష్టం. అవార్డు వచ్చిన తర్వాత వారం వరకు అందరూ సన్మానిస్తూనే ఉన్నారు. వారిచ్చే గౌరవం వెలకట్టలేనిది.
-గల్వే మంగమణి, ఏఎన్ఎం