చెన్నూర్ రూరల్, ఆగస్టు 4 : తల్లి పాలె బిడ్డకు శ్రీరామ రక్ష అని అంగ్రాజ్పల్లి సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ భారతి అన్నారు. చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో అంగ్రాజ్పల్లి సెక్టార్లోని పలు గ్రామాల అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ తీశారు. శిశువు పుట్టిన మొదటి గంట లోపు ముర్రు పాలను తాగించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించాలని సూపర్వైజర్ భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేశ్వరం నాగభూషణం చారి, ఉప సర్పంచ్ నస్కూరి శ్రీనివాస్, ఎంపీటీపీ ఇనగంటి వసంత, హెచ్ఈవో జగదీశ్, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, పాఠశాల ఏఎంసీ చైర్మన్ ఇంగిలి లింగయ్య, అంగన్వాడీ టీచర్లు పద్మ, సుజాత, సంగెం పద్మ, భూపతి రమాదేవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
తాండూర్, ఆగస్టు 4 : మండలంలోని తాండూర్, మాదారం సెక్టార్లలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. కిష్టంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని తంగళ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ సార్ల పద్మ, సూపర్వైజర్ మమత పాల్గొని గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. తల్లి పాలు శిశువుకు ఆరోగ్యప్రదాయినీ అని తెలిపారు. వందలాది బిడ్డలను సంరక్షించే తల్లులుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గ్రామాల్లోని బాలింతలు, గర్భిణులకు పోషకాహారాన్ని అందించే గురుతర బాధ్యత ఉన్నదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మేకల విజయలక్ష్మి, బొమ్మ రాజేశ్వరి, బూడిద లీల, బియ్యాల విజయలక్ష్మి, ఆయా నజీరా బేగం, గర్భిణులు, బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు, తదితరులున్నారు.
నెన్నెల, ఆగస్టు 4 : తల్లిపాలే పిల్లలకు శ్రీరామరక్ష అని బెల్లంపల్లి సీడీపీవో మాస ఉమాదేవి అన్నారు. మండలంలోని కుష్నపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, సర్పంచ్ బెల్లంపల్లి సంధ్యలతో కలిసి సీడీపీవో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సృజన, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణులు బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.
జన్నారం, ఆగస్టు 4 : పుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలను తాగించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ సూచించారు. తిమ్మాపూర్లో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి గంగాధర్, ఎం పీటీసీ దర్శినాల వెంకటస్వామి, కార్యదర్శి లావణ్య, అంగన్వాడీ కా ర్యకర్తలు జాడి సంజీవరాణి, జమున, మాధవి, రజిత పాల్గొన్నారు.
బెల్లంపల్లి రూరల్, ఆగస్టు 4: మండలంలోని తాళ్లగురిజాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గాజుల రంజిత సమక్షంలో తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడీ టీచర్లు వివరించారు. చిన్నారులకు తప్పని సరిగా తల్లిపాలు తాగించాలని సూచించారు. తల్లులు, బాలింతలు సంపూర్ణమైన పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం బాలామృతం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.