నార్నూర్, ఆగస్టు 4 : అమ్మపాలు బిడ్డకు అమృతంతో సమానం. ముర్రుపాలు శిశువును రోగాల నుంచి దూరం చేస్తాయి. ఆరు నెలల పాటు తప్పనిసరిగా తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయ స్కరమని వైద్యులు చెబుతున్నారు. కానీ, చాలా మంది తల్లులు చంటి బిడ్డలను చనుబాలకు దూరం చేస్తున్నారు. డబ్బాపాలు పట్టిస్తూ వారికి తెలియకుండానే ఆనారోగ్యానికి బీజం వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సేవల విస్తరణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… ఇటువంటి సా మాజిక రుగ్మతలను రూపుమాపడంపై దృష్టి సారించింది.
మాతా-శిశు సంరక్షణే లక్ష్యంగా ఈ నెల 7వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. నార్నూర్ ఉమ్మడి మండల వ్యాప్తంగా 1103 ప్రధాన, 51 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో5,547మంది పిల్లలు, 456మంది గర్భిణులు, బాలింతలు 455మంది ఉన్నారు. ఏటా అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించి గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు బృందాలుగా ఏర్పడి గర్భిణులు, బాలింతల ఇండ్లకు వెళ్లి తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 4 : తల్లిపాలు రోగనిరోధక శక్తిని పెంపొదిస్తాయని డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు సురక్షితమని తెలిపారు. తల్లిపాల ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సీవో రమణ, ఆరోగ్య పర్యవేక్షకులు మతీన్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం వల్ల పసిబ్డిడ్డల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలలో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. అలాగే టీకా మందుగానూ ఉపయోగపడుతాయి. అందుకే తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లి సైతం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు.
– పవన్కుమార్, వైద్యుడు, ఝరి పీహెచ్సీ
తల్లిపాలు అమృతంతో సమానం. వీటితో బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఎంత ఎక్కువగా పాలు ఇస్తే అంత ఉత్పత్తి అవుతాయి. ఆరు నెలల వరకు వేరే ఆహారం పెట్టకుండా తల్లిపాలే పట్టాలి. పాలు పట్టించడం బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. తల్లి పాలపై వారం రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నాం.
– శారద, సీడీపీవో, ఐసీడీఎస్ నార్నూర్