రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు.. పాలకులను ఎన్నుకోవాలన్నా.. సమాజాన్ని మార్చాలన్నా అదే కీలకం.. ఒక్క ఓటు తేడాతో ఎంతో మంది రాజకీయ నాయకుల భవిష్యత్ తారుమారయ్యింది. అంతటి విలువ గల ఓటు హక్కును పొందడంలో కొందరు నిరాసక్తి చూపుతుండగా, మరికొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి ఓటు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఓటు హక్కు నమోదుకు ఏడాదిలో నాలుగు తేదీలను ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నది. ఇక ఆధార్ అనుసంధానం చేసి కొత్త సాఫ్ట్వేర్ ద్వారా బోగస్ ఓట్లకు చెక్ పెట్టనున్నది.
ఇందుకోసం రేపటి నుంచి ఇంటింటా సర్వే నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గడిచిన మూడేళ్లలో ఆశించిన స్థాయిలో ఓటరు నమోదు జరగలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఈసారి అర్హులందరినీ ఓటరు జాబితాలోకి తీసుకు వచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
కరీంనగర్/ఆదిలాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటరు నమోదు విషయంలో పలు పరిణామాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈసారి కొన్ని మార్పులు చేర్పులకు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునే వారు. ఇలా చేయడం వల్ల నిర్ణీత సమయంలో కొంత మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని భావించి, ఈసారి పలు మార్పులు చేసింది.
ఇక నుంచి యేటా మూడునెలలకోసారి (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ విధానంతో యువ ఓటర్ల సంఖ్య పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఇదే సమయంలో బోగస్ ఓటర్లకు చెక్పెట్టేందుకు గరుడ యాప్ను అమల్లోకి తెస్తున్నది. ఈ కొత్త సాఫ్ట్వేర్తో రెండు లేక అంతకు మించి నమోదు చేసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం ఒక్కో వ్యక్తి రెండుచోట్ల ఓటు నమోదు చేసుకుంటుండగా, ఇకపై ఇలాంటి వాటికి అవకాశం ఉండదు.
ఇదే సమయంలో ఆధార్ నంబర్ అనుసంధానం ఐచ్చికమే అంటూ ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. కానీ.. బోగస్ ఓటర్లకు చెక్ పడాలంటే.. ఆధార్ నంబర్తో పోల్చిచూసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మంది ఆధార్ ఇవ్వకపోతే, కనీసం నంబర్ తీసుకొని అక్కడే పోల్చిచూసుకునే వెసలు బాటు కొత్తసాఫ్ట్వేర్లో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం ఆగస్టు ఒకటి నుంచి ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు.
2023లో జరగనున్న అసెంబ్లీ పార్లమంట్ ఎన్నికలకు ఈ ఓటరు జాబితే ప్రధాన భూమిక పోషించే అవకాశాలున్నాయి. ఆగస్టు ఒకటి నుంచి మొదలుకొని.. వచ్చే అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్ సర్వే నిర్వహంచి నవంబర్ 9వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
డిసెంబర్ 8 నుంచి ముసాయిదా జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు డిసెంబర్ 26వ తేదీలోగా వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. 2023, జనవరి 5 వరకు తుది ఓటరు జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈసారి సమయం ఎక్కువగా ఉండడం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జాబితా కీలక భూమిక పోషించనుండడంతో ఈసారి ఓటరు నమోదుపై ఆసక్తి నెలకొంది.
ఈసారి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆషామాషీగా కాకుండా.. పకడ్బందీగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసకుంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బూత్లెవల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతుండగా, నియోజకవర్గాల వారీగా ఓటర్ నమోదుపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి గ్రామం, వార్డు, డివిజన్ పరిధిలో జరిగే ఓటర్ నమోదుపై ముందస్తుగా ప్రకటనలు విడుదల చేయడం, ప్రజలకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవడం.. స్పందనను బట్టి.. అవసరమైతే అక్కడే ఒకటీ రెండు రోజులు ఎక్కువ సమయం వెచ్చించడం చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తీ తన ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
నిజానికి గతంలోనూ పలుమార్లు ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు అవకాశం కల్పించినా, పెద్దగా ఆసక్తి చూపిన దాఖలు లేవు. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21,06,626 మంది ఓటర్ల ఉన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగుసార్లు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించగా, అనుకున్న స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో.. ఈసారి కూడా గత పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
ఇంటింటా సర్వేతో పాటు ఓటు ఆవశ్యకతను వివరిస్తూ.. గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తంగా ప్రతి అర్హుడినీ ఓటరుగా నమోదు చేస్తే కొత్తగా భారీ మొత్తంలో ఓటర్లు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఓటర్ల నుంచి స్పందన ఎలా ఉంటుందోనన్న అంశంపై మాత్రం ఉత్కంఠ అన్ని వర్గాల్లో నెలకొంది.