ఆదిలాబాద్ రూరల్, జూలై 26: విద్యార్థుల్లో తెలుగు, గణిత సామర్థ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఇస్తున్న తొలిమెట్టు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన తొలిమెట్టు మూడు రోజల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఆయా సబ్జెక్టుల్లో మంచి నైపుణ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకుని ముందుకుసాగితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. 5 రోజులు బోధనాభ్యాసన ప్రక్రియలు నిర్వహించి, 6వ రోజు పిల్లల స్థాయిని నిర్ధారించడానికి మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. రిసోర్స్పర్సన్లు బాగా నేర్చుకుని మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు నర్సయ్య, సుజత్ఖాన్, రాష్ట్ర పరిశీలకుడు ప్రతాప్, రిసోర్స్ పర్సన్లు గంగయ్య, సతీశ్, రవికుమార్, శివారెడ్డి పాల్గొన్నారు.