ప్రస్తుతం లాభదాయక పంటలవైపు రైతాంగం దృష్టిసారిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో ఈ యేడాది నిర్మల్ జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుమతులిచ్చింది. దీంతో 11,400 ఎకరాల్లో సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రక్రియను చేపట్టింది. తోటలను సాగు చేసే రైతులకు ఒక్కో మొక్కకు రూ.20 చొప్పున అందజేయడంతోపాటు డ్రిప్, ఇతర వాటికి రూ.47,065ను ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేయనున్నది. రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని చైతన్యవంతులను చేసేందుకు ఉద్యానవన శాఖ సన్నద్ధమవుతున్నది.
నిర్మల్, జూన్ 24(నమస్తే తెలంగాణ): ‘మారుతున్న పరిస్థితులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో మార్కెట్లో పెరుగుతున్న ఆయిల్ ధరలతోపాటు వినియోగం పెరిగిన కారణంగా విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న దిగుమతులను అరికట్టడానికి రైతులను ఆయిల్ పామ్ తోటల సాగువైపు మళ్లిస్తున్నది. ఇందుకోసం మొక్కలను రాయితీపై అందజేయడంతోపాటు పలు ప్రోత్సాహకాలను కూడా కల్పిస్తుండడంతో తోటల సాగుకు జిల్లా రైతాంగం ముందుకొస్తున్నది. ఇప్పటికే జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు జిల్లాలో కొన్ని చోట్ల రైతులు సంప్రదాయకంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టారు.’
దేశంలో విదేశీ మారక నిల్వలు ఎక్కువ వినియోగించి దిగుమతి చేస్తున్న ఆహార పదార్థాల్లో ఆయిల్ వాటానే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆయిల్ కోసం ఉత్పత్తి అవుతున్న సీడ్స్తో కేవలం 30 శాతం డిమాండ్ మాత్రమే తీరుతోంది. మిగతా 70 శాతం ఆయిల్ నిల్వలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం ఆయిల్ ఉండగా..అందులో 62 శాతం పామాయిల్ ఉంటున్నది. ఈ లెక్కన పామాయిల్ సాగు పెంచడం వల్ల చాలావరకు దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నది.
ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఎకరాకు 50 నుంచి 57 మొక్కల అవసరం ఉంటుంది. ఒక్కో మొక్క ఖరీదు రూ.193 కాగా..సబ్సిడీపై రూ.173 లెక్కన ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం అందజేస్తోంది. డ్రిప్ సిస్టమ్ కోసం ఓసీ, బీసీలకు 80 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పంట ఎదుగుదల కాలంలోనూ పలు రూపాల్లో రూ.47,065ను ప్రోత్సాహకంగా అందించనుంది.
నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రియ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండి, నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే నాలుగేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. నాలుగేళ్ల తర్వాత దిగుబడులు మొదలవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ఆయిల్ పామ్ కాయలకు టన్నుకు రూ. 23 వేల ధర ఉంది. ఈ లెక్కన ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారా మొక్కలు ఎండిపోకుండా నీరు సమృద్ధిగా అందిస్తే దిగుబడులు మరింతగా వస్తాయంటున్నారు. మొదటి సంవత్సరం కొంత పెట్టుబడి కాగా..రెండో సంవత్సరం నుంచి కాత వచ్చే వరకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. మూడేళ్ల వరకు మొక్కల మధ్య పప్పు దినుసు పంటలు, కూరగాయలను అంతరపంటగానూ సాగు చేసుకోవచ్చు. అకాల వర్షాలు, గాలీ బీభత్సం వచ్చినా తోటలకు నష్టం ఉండదు. పశువులు, కోతులు కూడా పంటలను నష్టపర్చలేవని అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో 45 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది 11,400 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉద్యానవన శాఖ రైతులతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిసుత్న్నది. ఆసక్తి గల రైతులు ఇప్పటికే 6,500 మంది ఆయిల్ పామ్ సాగుకోసం అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైతులకు వివిధ రకాల రాయితీలతో అందజేయడంతోపాటు, పండించిన పంటలను సైతం ప్రభుత్వ రంగ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్కు పంపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
రైతులు ఆయిల్ పామ్ వైపు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఈ పంట మన ప్రాంతానికి కొత్త అయినా ఇక్కడి వాతావరణం, భూములు అనుకూలంగా ఉన్నాయి. మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు, పంటల విక్రయాల వరకు ఉద్యాన శాఖ అండగా ఉంటుంది. రైతులు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఎకరాకు లక్షన్నర వరకు సంపాదించవచ్చు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-శ్యాం రావ్ రాథోడ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి