తాంసి, జూన్ 24 : రైతులు పండించిన అన్ని పంటలనూ రాష్ట్ర సర్కారు కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న డీసీఎంఎస్ భవనానికి చైర్మన్ తిప్పని లింగయ్య, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందుతున్నాయన్నారు.
గత పాలకుల హయాంలో రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. అలాగే పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం రైతులు ఎంతో ఆనందంగా పంటలు పండిస్తున్నారని చెప్పారు. 24 గంటల నిరంతర కరంట్తో పాటు, సాగునీటికి కొదవలేదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పరిపాలన సాగుతున్నదని స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిని డీసీఎంఎస్ చైర్మన్, డైరెక్టర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, డైరెక్టర్లు నారాయణరెడ్డి, పురుషోత్తం యాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, డీసీఎంఎస్ మేనేజర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.