బేల, జూన్ 24 : అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చిన డబ్బుతో విత్తనాలు కొని వ్యవసాయం చేస్తుంటే అక్కడక్కడా పలువురు డీలర్లు మోసం చేస్తున్నారు. అమాయక రైతులకు మొలకెత్తని విత్తనాలను అంటగడుతున్నారు. బసంత్ ఆగ్రోటెక్ కంపెనీకి చెందిన విక్రాంత్ అనే రకం సోయా విత్తనాలు మొలకెత్తడం లేదని రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దాంతో శుక్రవారం బేల మండలంలోని ఖోగ్దుర్, పాఠన్, సిర్సన్న, అవల్పూర్, డోప్టాల తదితర గ్రామాల్లో వ్యవసాయ అధికారి పుల్లయ్య, బేల మండల వ్యవసాయ ఆధికారి వెండి విశ్వామిత్ర, శాస్త్రవేత్తలు మొలకెత్తని సోయా భూములను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు విత్తన డీలర్లు, కంపెనీలపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. మొలకెత్తని వాటి స్థానంలో జూలై నెలాఖరు వరకూ విత్తుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. రైతులు ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఆయన వెంట విస్తరణ ఆధికారులు ఉమర్, రాజు, నగేశ్, దీప్తి, రైతులు బత్తుల సుదర్శన్, రాజు, రాకేశ్ పాల్గొన్నారు.