బాసర, జూన్ 21 : బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్తో కలిసి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సందర్శించారు. ట్రిపుల్ ఐటీలో నిర్మాణ పనులు పునరుద్ధరించేందుకు, క్యాంపస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంచనాలను సిద్ధం చేసేందుకు పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, వైద్య శాఖలు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.
వైద్యశాఖ ద్వారా క్యాంపస్లో ఆరోగ్య శిబిరం నిర్వహించాలన్నారు. తెలంగాణ డయగ్నోస్టిక్ హబ్ ద్వారా విద్యార్థులకు 42 పరీక్షలు చేయాలని చెప్పారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృషిపెట్టాలని, న్యూట్రిషన్ ఫుడ్ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ఆరోగ్య శిబిరానికి భైంసా ఆర్డీవో లోకేశ్ ఇన్చార్జిగా ఉంటారని తెలిపారు.
డ్రైనేజీ, రోడ్లు, ఫుట్పాత్, విద్యుత్, తదితర పనులపై రూపొందించిన నివేదికలను పరిశీలించారు. అనంతరం క్యాంపస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వంటశాల, కొత్త మెస్ తదితరాలను పరిశీలించారు. కొత్త మెస్ను వారంలోగా పూర్తి చేసి, ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ అశోక్, వైద్యాధికారి ధన్రాజ్, ఈఈ పీఆర్ శంకరయ్య, ట్రిపుల్ ఐటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.