రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తున్న బీసీ స్టడీ సర్కిళ్లు పేదలకు వరంగా మారాయి. సమైక్య రాష్ట్రంలో కోల్పోయిన నీళ్లు, నిధులు, నియామకాలను, ప్రజానీకానికి అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నది. దశల వారీగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నది. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడేలా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నిర్మల్లోని పీజీ కళాశాల భవనంలో బీసీ స్టడీ సర్కిల్ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దీంతో స్థానిక అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -నిర్మల్ అర్బన్, జూన్ 17
నిర్మల్ అర్బన్, జూన్ 17 : కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు మనకే దక్కాయి. నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయగా మరో లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. దీంతో జిల్లాలోని ఉద్యోగార్థులు కోచింగ్ కోసం సగరాలకు పరుగులు తీస్తున్నారు. వేలాదిగా ఫీజులు చెల్లించే ఆర్థిక స్థోమత లేని యువత ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పేద యువతకు భరోసా కల్పించేలా రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాకు బీసీ స్టడీ సెంటర్ను మంజూరు చేయించారు. దీంతో నిరుద్యోగులు, విద్యావంతులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శనివారం బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి రాజేశ్వర్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పీజీ కళాశాల భవనంలో స్టడీ సర్కిల్ తరగతులను నిర్వహించనున్నారు. ఇందుకోసం పీజీ కళాశాలలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. శనివారం ఉదయం 9గంటలకు మంత్రి ప్రారంభించనుండడంతో కోచింగ్ తరగతులు కొనసాగనున్నాయి. ఇప్పటికే 200మంది అర్హత పరీక్ష రాసి శిక్షణకు సిద్ధమయ్యారు.
బీసీ స్టడీ సర్కిల్తో జిల్లాలోని 200 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఎటువంటి ఫీజు లేకుండా పూర్తి ఉచితంగా కోచింగ్, ైస్టెఫండ్, నాణ్యమైన మెటీరియల్ను అందించనున్నారు. గ్రూప్ 1 పరీక్షకు 100 మంది, ఎస్ఐ 50 మంది, కానిస్టేబుల్ అభ్యర్థులు 50 మంది చొప్పున మొత్తం 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ స్టడీ సర్కిల్తో పాటు ఐకేఆర్ ఫౌండేషన్ ద్వారా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 500 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కానిస్టేబుల్ శిక్షణను అందిస్తున్నారు. స్టడీ మెటీరియల్ను సైతం అందించారు.
నిరుద్యోగ అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పీజీ కళశాల భవనంలో శిక్షణ తరగతులు ఉంటాయి. సూచించిన సమయంలో సకాలంలో హాజరుకావాలి.
బీసీ సంక్షేమ అధికారి రాజేశ్వర్
జిల్లా యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేయించడం పట్ల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిరుపేద యువత ఇబ్బందులను గ్రహించి మంజూరు చేయడం అభినందనీయం.
ఎంబడి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు