ఇచ్చోడ, మే 28 : గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వచ్చే నెల 3 నుంచి చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎల్పీవో ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో శనివారం ఇచ్చోడ, సిరికొండ మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోని బావుల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో అంగన్వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాల్లో ప్రధానంగా వంగిపోయిన, కూలిపోయిన, తుప్పు పట్టిన, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో సెస్ అధికారుల సమన్వయంతో కొత్తవి వేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, ఎంపీవోలు కొమ్ము రమేశ్, అతుల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.