పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడు విడుతల్లో మొక్కల నాటింపు దిగ్విజయంగా పూర్తి చేయగా, వచ్చే నెలలో ఎనిమిదో విడుత చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో విరివిగా మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది కూడా ఆయా ప్రాంతాల్లో నాటే మొక్కలపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. కాగా, ఎనిమిదో విడుత హరితహారం కోసం జిల్లాలోని 310 నర్సరీల్లో 27 లక్షల మొక్కల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది.
మంచిర్యాల, మే 27 నమస్తే తెలంగాణ : జిల్లాలో లక్షా 76 వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఇది జిల్లా విస్తీర్ణంలో 44 శాతంగా ఉంది. హరిత తెలంగాణ సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా యే టా వర్షాకాలంలో హరితహారాన్ని చేపడుతున్నది. ఇందుకోసం స్థానిక సంస్థల బడ్జెట్లో పదిశాతం నిధులు కేటాయిస్తున్నది. త్వరలో జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మండలాల వారీగా 27 లక్షల మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం మొక్కలను నర్సరీల్లో పెంచి, నాటించే బాధ్యత డీఆర్డీవో, అటవీశాఖ, మున్సిపాలిటీలు, సింగరేణి సంస్థకు అప్పగించారు. ఈమేరకు జిల్లాలోని 310 నర్సరీల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
హరితహారంలో భాగంగా నాటే మొక్కల్లో 85 శా తం బతికేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు అం దించింది. వీటితో ఏడాది పాటు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేస్తుండగా అడవులు, జాతీయ రహదారులు, గ్రా మ పంచాయతీలు, ఆర్అండ్బీ రోడ్లు, ఖాళీ స్థలా ల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
హరితహారం మొక్కలు నాటి, సంరక్షణ చర్యలపై కలెక్టర్ భారతీ హోళికేరి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి శివానీ డోం గ్రేతో కలిసి జిల్లా గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, పంచాయతీ, రోడ్లు-భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో తరచూ సమీక్షా సమావేశా లు నిర్వహిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం, కాలువలు, తూముల వెంట మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 310 పంచాయతీలుండగా, ప్రతి జీపీలోనూ నర్సరీ ఉంది. 548 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. పీపీవీలో 11.40 లక్షల మొక్కలు పెరుగుతున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లోని నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇవేగాకుండా ప్రతి ఇంటికీ పూలు, పండ్ల 6 మొక్కలను అందిస్తారు. గతేడాది లాగే ఈ సారి కూడా 27 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు ప్రతి మండలంలో నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐదెకరాల్లో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తారు. ప్రతి వనంలో 15 వేల మొక్కలు నాటనున్నారు. వీటితో పాటు మల్టీ లేయర్ కింద కాలువలపై, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బెల్లంపల్లి మండలంలో 1,13,917 మొక్కలు, భీమినిలో 1,03,040, భీమారంలో 84,150, చెన్నూర్లో 2,93,811, దండేపల్లిలో 1,76,891, హాజీపూర్లో 1,16,966, జైపూర్లో 87,530, జన్నారం లో 92,825, కన్నెపల్లిలో 1,27, 456, కాసిపేటలో 1,37, 950, కోటపల్లిలో 2,16,074, లక్షెట్టిపేటలో 69,518, మందమర్రిలో 1,20, 849, నెన్నెల్లో 1,06,142, తాండూర్లో 94,606, వేమనపల్లిలో 1,21,027 కలిపి జిల్లాలో మొత్తం మండలాల్లో 20 లక్షలకు పైగా మొక్కలను లక్ష్యం గా నిర్దేశించుకొని, అందుకు అనుగుణంగా నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.