ఎదులాపురం, మే26 : ఆదిలాబాద్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆర్అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో రోడ్డు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి రూ.87.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, తాంసి బస్టాండ్ వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ నెల 30వ వరకు టెండర్లు పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణ, ఫుట్పాత్ నిర్మాణం పనులను చేపట్టేందుకు రెవెన్యూ, మున్సిపల్, రోడ్డు భవనాలు, రైల్వే అధికారులు సమస్వయంతో నిర్వహించాలని సూచించారు. హరితహారంలో భాగంగా రోడ్డు భవనాల శాఖ ద్వారా 300 కిలో మీటర్ల మేరకు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ ద్వారా 14 పాఠశాలల్లో ప్రహరీ, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం గిరివికాసం పథకం కింద 224 బోరు బావులకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు వెంటనే పనులను ప్రారంభించాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, రోడ్డు భవనాల ఎస్ఈ రాజేందర్ నాయక్, ఈఈ నర్సయ్య, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తమ్ జాడే, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
పట్ణణంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో తాగు నీటిసరఫరా, అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ , మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వార్డుల వారీగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని సూచించారు.
కేఆర్కే కాలనీలో తలెత్తిన నీటి సమస్యను మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో చేపట్టినఅభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తించేయాలన్నారు. హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి కావలసిన మొక్కల పెంపకానికి పట్టణ నర్సరీల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
జూన్లో ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పట్టణంలో చేపడుతున్న మన బస్తీ- మన బడి ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్షించాలని మున్సిపల్ ఎస్ఈ శ్రీనివాసరావును ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.